Mahesh Kumar Goud: పదేళ్లు జీవోలు దాచింది మీరే.. బీఆర్ఎస్ పై టీపీసీసీ విమర్శలు

by Prasad Jukanti |

పదేళ్లలో చంద్రబాబు, జగన్ తో లాలూచీ పడ్డది కేసీఆరేనని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.

Mahesh Kumar Goud: పదేళ్లు జీవోలు దాచింది మీరే.. బీఆర్ఎస్ పై టీపీసీసీ విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ జీవోలను (Government Orders) వెంటనే అధికారిక వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే పదేళ్లు ఎన్నో జీవోలు దాచిపెట్టిందని ఆరోపించారు. రేవంత్ సర్కార్ పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఒక్క జీవో కూడా ప్రభుత్వ వెబ్ సైట్లోకి ఎక్కలేదని దీన్ని హైకోర్టు గమనించాలన్నారు. ఇవాళ నిజామాబాద్‍లో ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. ప్రతి జీవో ప్రజలకు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందన్నారు.

కేసీఆర్ వల్లే కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డితో లాలూచీ పడ్డది కేసీఆర్ హరీశ్ రావేనని ధ్వజమెత్తారు. ఇప్పుడు సిగ్గులేకుండా మళ్లీ మాట్లాడుతున్నారని మేము చెప్పిన వాటిల్లో 80 శాతం హామీలు అమలు చేస్తున్నామన్నారు. కాగా ఈ ప్రభుత్వం జీవోలను అప్ లోడ్ చేయడం లేదంటూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు జీవోలను వెంటనే అప్ లోడ్ చేయాలని ఆదేశించింది.

Next Story