ఖైదీలకూ దళితబంధు అందేలా చూస్తాం: ఖమ్మం కలెక్టర్

by Disha Web Desk 2 |
ఖైదీలకూ దళితబంధు అందేలా చూస్తాం: ఖమ్మం కలెక్టర్
X

దిశ, ఖమ్మం అర్బన్: ఖమ్మం జిల్లా జైల్‌లో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని జైల్ సూపరిండెంట్ ఎ.శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతం, ప్రత్యేక అతిథిగా జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్, ఆత్మీయ అతిథిగా జిల్లా లీగల్ సెల్ అథారిటీ & సీనియర్ సివిల్ జడ్జి అబ్దుల్ జావెద్ పాషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వళన చేసి, మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులుఅర్పించారు. అనంతరం ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనమందరం మనుషులమే.. అందరూ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే అసలు నేరాలే జరగవని, క్షణికావేషంలో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడి జైల్‌కు రావల్సిన అవసరమే ఉండదని ఉపదేశించారు. అలాగే జైల్‌లో ఖైదీలకు ఉపయోగపడే విధంగా కావల్సిన కంప్యూటర్లను సరఫరా చేస్తామని, ఖైదీల శిక్షా కాలం అనంతరం వారి ఉపాధి కోసం అవసరమైతే దళితబంధు ద్వారా వారికి సహాయం అందేలా చూస్తానని తెలిపారు. జైల్స్ గతం కన్నా ఇప్పుడు ఆహ్లాదంగా ఉన్నాయని కొనియాడారు.

పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడేలా యువకులు తయారవ్వాలని సూచించారు. లీగల్ సెల్ అథారిటీ అధికారి అబ్దుల్ జావెద్ పాషా మాట్లాడుతూ.. ఖైదీలకు ఎప్పుడు కావాలన్నా ప్రభుత్వం నుండి న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లా జైల్ పర్యవేక్షణ అధికారి ఎ.శ్రీధర్ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతాలను గుర్తు చేస్తూ, సంవత్సర కాలంలో జైల్‌లో చేపట్టిన అనేక కార్యక్రమాలు వివరిస్తూ, ముద్దాయిలకు జైళ్ళ శాఖ కల్పిస్తున్న అనేక సౌకర్యాలు, పెట్రోల్ బంకులలో కల్పిస్తున్న ఉద్యోగాల గురించి, నిరక్ష్యరాస్యుల ముద్దాయిలను అక్షరాస్యులుగా మార్చుట లాంటి అనేక ప్రగతి కార్యక్రమాలు గురించి వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో జైలర్లు సక్రు నాయక్, లక్ష్మీనారాయణ, జైల్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story