అవును నేను పెళ్లిళ్ల పేరయ్యనే.. మీలాగా కేసులు పెట్టి విడదీయలేదు: ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

by Disha Web Desk 11 |
అవును నేను పెళ్లిళ్ల పేరయ్యనే.. మీలాగా కేసులు పెట్టి విడదీయలేదు: ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
X

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: 'నేను పెళ్లిళ్లు చేసే పేరయ్యనే.. కానీ నీలా ఉన్న జంటలను విడగొట్టలేదు, వాళ్ల సంసారాలపై మన్ను పోయలేదు. పేద బిడ్డలకు పెద్ద దిక్కుగా, ఉన్నత వర్గాల వారు జరిపే రీతిలో పెళ్లిళ్లు చేసి వారికి నూతన జీవితాన్ని అందిస్తున్నా' అంటూ మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ధీటైన సమాధానం ఇచ్చారు. దైవానుగ్రహంతో సంపాదించిన డబ్బు ఇన్కమ్ టాక్స్ చెల్లించగా మిగిలిన ఆదాయాన్ని కుటుంబానికి ఖర్చు చేస్తూనే సమాజం కూడా కుటుంబంగా భావించి ఇలాంటి పెళ్లిళ్ల కార్యం చేస్తూ పెళ్లిళ్ల పేరయ్యగా మారానని ఎమ్మెల్యే అన్నారు. ఆదివారం బ్రహ్మ ముహూర్తాన నిర్వహించిన సామూహిక వివాహంలో 220 మంది పేద జంటలు ఒక్కటి కాగా వారిని ఆశీర్వదించేందుకు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే పెళ్లిళ్లు చేస్తున్నారని రాజకీయ విమర్శలు చేసే వారు, దమ్ముంటే ఇలాంటి పెళ్లిళ్లు చేసి చూపాలని సవాల్ చేశారు. వారు చేయరు ఇతరులు చేస్తే సహించరా అంటూ మండిపడ్డారు.

ఇప్పటికే నాలుగు పర్యాయాలుగా 485 పెళ్లిళ్లు చేసి ఈ సారి మరింత ప్రజా బలంతో 220 మందికి నూతన జీవితాన్ని అందించగలిగానన్నారు. ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాల ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్నదని, ఆడపిల్లలు పుట్టడమే భారంగా భావించే పరిస్థితుల్లో పెళ్లి తంతు కోసం అష్ట కష్టాలు పడుతున్నారని చివరకు అప్పుల పాలు అవుతున్నారని గుర్తించి, ఆ పరిస్థితి రాకుండా బాధ్యతగా సంసారిక జీవితానికి అవసరమయ్యే అన్ని మౌలిక వసతులు సమకూరుస్తూ సామూహిక వివాహాలు జరిపిస్తున్నానని పేర్కొన్నారు. ఇందుకు తన జీవిత భాగస్వామి మర్రి జమునా రెడ్డి, సోదరుడు, వారి సతీమణి, తల్లి, తండ్రి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తున్నాయని వారిచ్చే ఆశీర్వచనం తోటే పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సహకారం అందుతుందన్నారు. మొదటిసారి పెళ్లిళ్లు జరపాలని నిర్ణయించిన తరుణంలో గ్రౌండ్ అనుమతి ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురిచేశారని చివరకు కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా కష్టపెట్టారని ఆరోపించారు.

ఈ ప్రాంత పేద ప్రజలు ఉన్నతంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే విద్య, వైద్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అందులో భాగంగానే సొంతంగా పాఠశాలలను నెలకొల్పినట్టు పేర్కొన్నారు. వైద్యరంగంలోనూ పేదలకు మేలు జరగాలన్న లక్ష్యంతో వైద్య కళాశాల తీసుకొచ్చేందుకు ఎంతగానో శ్రమ పడినట్లు గుర్తు చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా బీఆర్ఎస్ పేదల గుండెల్లో నిలిచిందని తన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఇచ్చే బలంతోనే మునుముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు. తమిళనాడులోని జయలలిత కూతురు వివాహానికి హాజరై అక్కడ చూసిన పెళ్లిళ్లు, పేదవారి ఇళ్లల్లోనూ జరగాల్సిన అవసరం ఉందని అందులో భాగంగానే ఇలాంటి అంగరంగ వైభవపేత ఏర్పాట్లతో పెళ్లిళ్లు జరపాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed