సామాజిక మార్పుల పై రచనలు రావాలి..

by Disha Web Desk 20 |
సామాజిక మార్పుల పై రచనలు రావాలి..
X

దిశ, మహబూబ్ నగర్ : సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులు, అభివృద్ధి పై రచయితలు, కవులు రచనలు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రముఖ సాహితీ, విద్యావేత్త లుంబిని లక్ష్మణ్ గౌడ్ రచించిన వేగుచుక్క పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పుస్తక ఆవిష్కరణ అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో కవులు, రచయితలు, కళాకారులది ప్రధాన పాత్ర అన్నారు. ఎప్పుడో జరిగిన రామాయణము, మహాభారతం వంటి కథలు, తల్లిదండ్రులు, అన్నదమ్ముల అనుబంధాలు, నమ్మిన వారి కోసం చేసే త్యాగాలు ఇలా ఉండాలి సమాజానికి తెలియజేసింది కవులు, రచయితలే అని మంత్రి గుర్తు చేశారు. కరువు, వలసల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు రెక్కల కష్టాన్ని నమ్ముకుంటూ వచ్చారు.

ఆ రెక్కల కష్టాలు.. చెమట చుక్కల్లో నుంచి ఎన్నో రచనలు, కథలు రచన రూపం దాల్చాయి అన్నారు. ఒకరకంగా తెలంగాణ సాహిత్యంలో పాలమూరు కవులు రచయితలు ప్రధానపాత్ర అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం ఈ జిల్లాలో లభించింది. అంతటి ప్రాధాన్యత గల సాహితీ వేత్తలను అందించిన ఘనత ఈ జిల్లాకు దక్కుతుందన్నారు. తెలంగాణలో కవులే లేరు అన్న ఆంధ్రకవుల ఆరోపణలకు రాష్ట్రంలో ఉన్న కవుల అందరి వివరాలను సేకరించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రిక సంచికను విడుదల చేసినోళ్లు మూయించిన అంశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్నాం.. 2014 తర్వాత జరిగిన అభివృద్ధి, సామాజిక మార్పుల పై సాహితీవేత్తలు దృష్టి సారించి రచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

యువతరం రచన, సాహిత్య రంగాల పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదని.. ఇది మునుముందు పెద్ద ప్రమాదకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత సాహిత్యం పట్ల ఆసక్తి పెంచుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సమాజానికి ఉపయోగపడే రచనలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి యువతకు అందుబాటులో ఉండే విధంగా సాహితీవేత్తలు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ కవిత్వంలో విభిన్న పార్శ్వాలు కనిపిస్తాయి అన్నారు. దూరదర్శన్ మాజీ సంచాలకులు డాక్టర్ ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావడంలో కవిత్వం ప్రధాని పాత్రపోషిస్తుంది.

సమాజాన్ని చైతన్య పరచడమే కవి లక్ష్యం అని చెప్పారు. ప్రముఖ న్యాయవాది మనోహర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ ఒకవైపు విద్యార్థులను తీర్చిదిద్దేల విద్యాసంస్థలు వైపు సాహిత్యం పై ఉన్న అభిమానం, సామాజిక చైతన్యం కోసం రచనలు చేయడం అభినందనీయం అన్నారు. వేగుచుక్క పుస్తకాన్ని రచించిన లక్ష్మణ్ గౌడ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు అభినందనలు తెలిపారు. ప్రముఖకవి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గణపురం దేవేందర్ పుస్తక సమీక్ష చేయగా, మొగ్గలు సాహిత్య ప్రక్రియ సృష్టికర్త డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, బాదేపల్లి వెంకటయ్య స్వాగతోపన్యాసాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్య, సాహితీవేత్తలు ఎస్.జగపతిరావు, డాక్టర్ విజయ్ కుమార్, సూర్యనారాయణ, నస్కంటి, నాగభూషణం, రావూరి వనజ, పులి జమున ఖలీల్, హనీఫ్, సుధాకర్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed