సమాచారం లేకుండా సమావేశానికి ఎందుకొచ్చిండ్రు.. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

by Disha Web Desk 11 |
సమాచారం లేకుండా సమావేశానికి ఎందుకొచ్చిండ్రు.. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
X

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: వేసవి కాలంలో ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు కావాల్సిన ప్రణాళిక నివేదిక లేకుండానే సమీక్ష సమావేశానికి ఎందుకొచ్చారని కలెక్టర్ పి ఉదయ్ కుమార్ పంచాయతీ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎండ తీవ్రతతో ప్రజల ఆరోగ్య సమస్యలు, వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలపై ఆర్‌డబ్ల్యూఎస్‌, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు, ఇంజనీర్లు, డీపీఓ, ఉద్యాన, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లోని ప్రజల సంఖ్యకు అనుగుణంగా నీటి లభ్యత అంశాలపై చర్చించారు.

శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజీలో ఉందని సాగర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ కు నీటి తరలింపు చేస్తున్నామని ఈఈ ఆర్డబ్ల్యూఎస్ సుధాకర్ సింగ్ కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 88 చెంచు పెంటల నీటి సమస్య పరిష్కారానికి ఎంత డబ్బు ఖర్చు అయినా చేస్తామని ప్రకటించారు. రిజర్వాయర్ పంపులకి విద్యుత్ సరఫరా సకాలంలో అందించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది తీవ్రమైన ఎండలు ఉన్నందున ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్నారులు, వృద్ధులకు అవగాహన కల్పించి, ఎండల తీవ్రత నుంచి కాపాడాలన్నారు.

గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలలో నీడనిచ్చేలా గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయాలన్నారు. చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. హరితహారం ద్వారా నాటిన మొక్కల సంరక్షణకై ప్రతి వారంలో రెండు రోజులు నీటిని అందించాలన్నారు. ఇటీవల జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు ఆస్తి, పంట నష్ట వివరాలను తెలపాలని ఆదేశించారు. పంచాయతీల్లో ఉన్న నీటి సమస్యల విషయమై పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మను చౌదరి, మోతిలాల్, డీపీఓ కృష్ణ, మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈలు సుధాకర్ సింగ్, శ్రీధర్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర రావు, ఆర్డీవోలు నాగలక్ష్మి, పాండు నాయక్, హనుమాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed