మంత్రి మ‌దిలో ఆ న‌లుగురు ఎవ‌రు..?

by Ratna Kumari |   (  Updated:2026-03-05 09:14:27  IST  )

మ‌క్త‌ల్ మున్సిపాలిటీ కో ఆప్ష‌న్ స‌భ్యులు ఎవ‌రు అనేది ఉత్కంఠ‌గా మారింది. మంత్రి వాకిటి శ్రీహ‌రి ఎవ‌రినీ నియ‌మిస్తార‌ని చాలా ఆశావాహులు ప‌ద‌వుల కోసం ఎదురుచూస్తున్నారు.

మంత్రి మ‌దిలో ఆ న‌లుగురు ఎవ‌రు..?
X

దిశ‌, మ‌క్త‌ల్ : మ‌క్త‌ల్ మున్సిప‌ల్ కొత్త పాల‌క‌వ‌ర్గాలు కొలువు దీని రెండు వారాలు అవుతోంది. త్వ‌ర‌లో నోటిఫికేష‌న్ వేయ‌డానికి అధికారులు స‌న్న‌ద్ధం చేస్తున్నారు. నాలుగు ప‌ద‌వుల్లో ఒక‌టి మైనార్టీ సామాజిక వ‌ర్గంగా ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్ప‌టికే మైనార్టీలో ఓ వ్య‌క్తిని ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మిగ‌తా ముగ్గురు ఎవ‌ర‌నేది మ‌దిలో ఉంది. కో ఆప్ష‌న్ ప‌ద‌వీ పై ఆశ పెట్టుకున్న వారు ఎవ‌రితో మంత్రికి ఒప్పిస్తే స‌రిపోతుంద‌ని ఎవ‌రి ప్ర‌య‌త్నంలో వారు కొన‌సాగుతున్నారు. అందుకు కో-ఆప్ష‌న్ ప‌ద‌వుల‌పై ఆశావాహుల్లో ఉత్కంఠ నెల‌కొంది. పుర ఎన్నిక‌ల్లో పోటీ అవ‌కాశం ద‌క్కి, ఎన్నికల స‌మ‌యంలో క‌ష్ట‌ప‌డిన సీనియ‌ర్ నేత‌లు కొంద‌రూ గ‌తం నుంచి త‌న‌ను అంటిపెట్టుకున్న‌వారు ఉన్నారు. రాజ‌కీయ ప‌రంగా త‌న‌కు విశ్వాసంగా ఉన్న‌వారి ప‌ని త‌నం చూసి మంత్రి అవ‌కాశం ఇస్తార‌ని ఆశ‌తో ఎదురుచూస్తున్నారు. మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ ప‌ద‌విని ఆశించిన వారు కాంగ్రెస్ పార్టీ ఉన్న‌త నాయ‌కుల‌తో చెప్పి ప‌ద‌విని కైవ‌సం చేసుకున్నారు. అదే మార్గంలో కో ఆప్ష‌న్ ప‌ద‌వుల‌పై ఆశ పెట్టుకున్న వారు కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం అయితే ఐదేళ్ల పాటు మున్సిపాలిటీలో చ‌క్రం తిప్పొచ్చ‌ని ఆశావాహులు ఆశ‌లు పెట్టుకుంటున్నారు.

కో ఆప్ష‌న్ ప‌ద‌వి ద‌క్కితే..

ప్ర‌ధానంగా కో ఆప్ష‌న్ ప‌ద‌వుల‌కు పుర ప‌రిధిలోని వివిధ రంగాల‌కు చెందిన వారికి ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెడుతారు. కో ఆప్ష‌న్ స‌భ్యులు కౌన్సిల‌ర్ల‌తో క‌లిసి పుర స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతారు. ఈ ప‌ద‌వులు ఆశించిన ప‌లువురు ఆశావాహులు మంత్రి వాకిటి శ్రీహ‌రి చుట్టూ తిరుగుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌న‌ర‌ల్ కోటాకు చెందిన కో ఆప్ష‌న్ ప‌దవుల‌కు మాత్ర‌మే గ‌ట్టి పోటీ ఉంద‌ని.. రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. తెలంగాణ మున్సిప‌ల్ చ‌ట్టం 2019 ప్ర‌కారం.. కో ఆప్ష‌న్ స‌మాన హోదా క‌లిగి ఉంటారు. గౌర‌వ వేత‌నంతో పాటు ఇత‌ర ప్రోత్స‌హ‌కాలు అంద‌జేస్తారు. చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో మాత్రం వీరికి ఓటు హ‌క్కు ఉండ‌దు. కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు 45 రోజు ల్లోపు పుర కమిషనర్ ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మైనార్టీ కోటాలో పోటీ పడేవారు తమ కుల ధ్రువీకరణ పత్రం జతచేస్తే పుర కమిషనర్ పరిశీలిస్తారు. పాలకవర్గం ఉన్నంత వరకు వీరు పదవుల్లో కొనసాగుతారు. వరుసగా మూడు సమా వేశాలకు హాజరుకాకపోతే సభ్యత్వం రద్దైయ్యేఅవకాశం ఉంది.

నలుగురికి అవకాశం..

మున్సిపల్ చట్టం ప్రకారం.. ప్రతి మున్సిపాలిటీలో నలుగురిని కో-ఆప్షన్ సభ్యులుగా నియమించుకునే అవకాశం ఉంది. మున్సిపాలిటీ పై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మైనార్టీలు (ఒక పురుషుడు, ఒక మహిళ), క్రిస్టియన్ మైనార్టీ, జనరల్, అను భవం ఉన్న మాజీ కౌన్సిలర్లు కేటగిరీల నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రతి మున్సిపాలిటీలో ఒక్కో కేటగిరి నుంచి పదుల సంఖ్యలో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.మంత్రి వాకిటి శ్రీహ‌రి ఇలాఖాలోని మ‌క్త‌ల్ మున్సిపాలిటీలో మైనార్టీ వ్య‌క్తి ఎవ‌రు అన్న‌ది మంత్రి ఇప్ప‌టికే డిసైడ్ చేసిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ఇత‌ర పార్టీలో ఉండి ప‌ద‌వులు అనుభ‌వించి కాంగ్రెస్ లోకి వ‌చ్చిన వారు కూడా ప‌ద‌వి పై ఆశ‌పెట్టుకొని ఉన్న‌వారికి కో ఆప్ష‌న్ స‌భ్యునిగాఅవ‌కాశం ఇస్తే.. అసమ్మ‌తి ర‌గిలి నిశ్శ‌బ్దంగా అంత‌ర్గతంగా పార్టీలో గంద‌ర‌గోళం జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని చ‌ర్చ కొన‌సాగుతోంది. ప‌లువురు తెర వెనుక పావులు క‌దుపుతున్నారు. మంత్రి కో-ఆప్ష‌న్ ప‌దవులు ఎవ‌రికీ ఇస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఆశావాహుల ఆశ‌లు నెర‌వేరుతాయో లేదో వేచి చూడాలి.

Next Story