కనీస పింఛన్‌ పెంచే వరకు విశ్రమించం.. విశ్రాంత ఉద్యోగుల ధర్నా

by Disha Web Desk 13 |
కనీస పింఛన్‌ పెంచే వరకు విశ్రమించం.. విశ్రాంత ఉద్యోగుల ధర్నా
X

దిశ, మహబూబ్ నగర్: ప్రభుత్వ రంగ సంస్థల ఈపీఎస్ పెన్షనర్ల కనీస పెన్షన్ రూ. 7,500 వరకు పెంచే వరకు విశ్రమించేది లేదని ఈపీఎస్ పెన్షనర్ల జాతీయ సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎ. రాజసింహుడు అన్నారు. జాతీయ సంఘర్షణ సమితి పిలుపు మేరకు బుధవారం మధ్యాహ్నం స్థానిక తెలంగాణ చౌరస్తాలో జరిగిన రాస్తారోకో కార్యక్రమ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత అయిదేళ్లుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నా కనీస పెన్షన్ పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోక పోవడం శోచనీయమని ఆవేదన చెందారు.


కనీస పెన్షన్ పెంపు పై సుప్రీం కోర్టు తీర్పు ఒకలాగ, కేంద్ర ప్రావిడెండ్ ఫండ్ నిర్ణయం మరోలా ఉండంతో పెన్షనర్లు అయోమయానికి గురవుతున్నారని.. ఎలాంటి నిబంధనలు లేకుండా విశ్రాంత ఉద్యోగులందరికి కనీస పెన్షన్ కరువు భత్యం తో 7,500 రూపాయలకు పెంచాలని, పెన్షనర్ల భార్యా భర్తలకు ఉచిత వైద్య సౌఖర్యాలను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ నాయకులు సాయిలు గౌడ్, బాలకిషన్, అంజయ్య చారి, కృష్ణయ్య, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు నవాబుపేట్ ఫోరం నాయకులు నర్సింహులు, విజయ్ కుమార్, శివస్వామి, జాతీయ సంఘర్షణ సమితి నాయకులు కొండయ్య, చంద్రశేఖర్ రావు తదితర ప్రభుత్వ రంగ సంస్థల విశ్రాంత ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed