యథేచ్ఛగా మొరం తరలింపు

by Ratna Kumari |

మండలంలోని పెద్ద వాగు నుంచి అక్రమార్కులు రోడ్డు పని పేరుతో పెద్ద ఎత్తున మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

యథేచ్ఛగా మొరం తరలింపు
X

దిశ, మాగనూర్ : మండలంలోని పెద్ద వాగు నుంచి అక్రమార్కులు రోడ్డు పని పేరుతో పెద్ద ఎత్తున మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఓబులాపురం గ్రామంలో మట్టి రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 1.20 లక్షల నిధులను మంజూరు చేసింది. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు గురువారం ఈ పనులు ప్రారంభమైనప్పటికీ, మొరం తరలింపునకు సంబంధించి రెవెన్యూ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. అయినప్పటికీ, నిబంధనలను తుంగలో తొక్కి ఒకే రోజు సుమారు 20 ట్రాక్టర్లు, హిటాచీ ఉపయోగించి విచ్చలవిడిగా మొరం తరలిస్తున్నారు.

ఉగాది పండగ సెలవు కావడంతో అధికారుల నిఘా ఉండదని భావించిన అక్రమార్కులు, ఈ సమయాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ రవాణాకు తెరలేపారు. పట్టపగలే యథేచ్ఛగా ట్రాక్టర్లతో మొరం తరలిస్తున్నా, అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన పని సాకుతో సహజ వనరులను కొల్లగొడుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఈ అక్రమ రవాణాను అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story