ప‌సిబిడ్డ‌ను హ‌త్య చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలి : సీపీఎం వ‌న‌ప‌ర్తి జిల్లా కార్య‌ద‌ర్శి పుట్ట ఆంజ‌నేయులు

by Ratna Kumari |   (  Updated:2026-02-24 15:34:10  IST  )

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ప‌సిబిడ్డ‌ను హ‌త్య‌ను చేసిన నిందితుల‌కు వెంట‌నే క‌ఠిన శిక్ష వేయాల‌ని సీపీఎం వ‌న‌ప‌ర్తి జిల్లా కార్య‌ద‌ర్శి పుట్ట‌గ‌ల్ల ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు ఎం.డీ. జ‌బ్బార్ డిమాండ్ చేశారు.

ప‌సిబిడ్డ‌ను హ‌త్య చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలి : సీపీఎం వ‌న‌ప‌ర్తి జిల్లా కార్య‌ద‌ర్శి పుట్ట ఆంజ‌నేయులు
X

దిశ‌, వ‌న‌ప‌ర్తి : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ప‌సిబిడ్డ‌ను హ‌త్య‌ను చేసిన అగ్ర‌కుల దుర‌హంకారుల‌ను హంతకులంద‌రినీ 24 గంటల‌లోపే అరెస్ట్ చేసి, హ‌త్య నేరం కింద కేసు న‌మోదు చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని సీపీఎం వ‌న‌ప‌ర్తి జిల్లా కార్య‌ద‌ర్శి పుట్ట ఆంజ‌నేయులు, సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు ఎం.డీ. జ‌బ్బార్ డిమాండ్ చేశారు. కుమ్మెర గ్రామంలో రెండు నెల‌ల ప‌సిబిడ్డ‌ను అత్యంత క్రూరంగా, అవ‌మానీయంగా కాలుతో త‌న్ని హత్య చేసిన గ్రామ అగ్రకుల పెత్తందారులు శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కన్నిరెడ్డి మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, హత్యా నేరం కింద కేసు నమోదు చేసి తక్షణమే రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. అత్యంత పాశవిక దాడిని సీపీఎం పార్టీ వనపర్తి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పండగలు, ఉత్సవాలలో కులవివక్ష అగ్రకుల దురహంకారంతో ప్రజల మధ్య కులవిద్వేషాలు సృష్టంచడం తగదాన్నారు. దేవుణి దగ్గరికి వెళ్లడానికి 100 రూపాయలు ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించిన పాపానికి, చెల్లిస్తాం కానీ రషీద్ ఇవ్వండని అడిగినందుకు సుమారు మూడున్నర గంటలపాటు గణేష్ అనే యువకుడిని చితక బాధారని చెప్పారు.

తన భర్తను కొట్టవద్దని తన తమ్ముడిని కొట్టవద్దని గణేష్ అక్క కీర్తి భార్య మౌనిక ఎంతగా బ్రతిమిలాడిన కాళ్లు మొక్కడానికి ప్రయత్నం చేసిన కాళ్లతో తన్నడం, రెండు నెలల పసిబిడ్డ ఉంది నా భర్తను కొట్టకండి చంపకండి అని వేడుకున్న చివరికి ఏమాత్రం కనికరం లేకుండా, అమానవీయంగా మానవ మృగంలా రెండు నెలల పసి బిడ్డపై కూడా కాలితో తన్ని క్రూరంగా పసిబిడ్డను హత్య చేశారని చెప్పారు. ఈ ఘటన సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా మానవత్వాన్ని మంటగలిపే విధంగా ఉందనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నెల 18న ఈ సంఘ‌ట‌న జరిగితే పోలీసులు బాధితులే అగ్రకుల పెత్తందారులపైన దాడి చేసినట్లుగా బాధితులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు అన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే పోలీసులు హంతకులకు న్యాయం, బాధితులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాధితులకు న్యాయంచేసే క్రమంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

డీఎస్పీ శ్రీనివాస్ ముందు హంతకులపై కేసు నమోదు చేయాల్సి ఉండగా.. బాధితులపై కేసు పెట్టారని చెప్పారు. 8 మంది పై ఫిర్యాదు చేస్తే నలుగురిని మాత్రమే అరెస్టు చేశారని మిగతా వాళ్లను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయన్నారు. హత్య జరిగితే ముందస్తు మర్డర్ గా అటెంప్ట్ మర్డర్ గా కేసు నమోదు చేయడం విడ్డూరమన్నారు. హత్య జరిగిందని పసి బిడ్డను చంపారని సభ్య సమాజం గుర్తించినప్పటికీ పోలీసులు గుర్తించినట్లుగా లేదన్నారు. తక్షణమే హత్యా నేరం కింద 103 సెక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని లేనిచో ఆందోళనలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండ్ల రాజు, లక్ష్మి టౌన్ కమిటీ సభ్యులు డి కురుమయ్య, సీపీఎం కౌన్సిలర్ గంధం మదన్, గట్టయ్య, రమేష్, నందిమల్ల రాములు, జి బాలరాజ్, రాబర్ట్, పుల్లయ్య, బాలస్వామి, మన్యం, భాస్కర్, మధు పాల్గొన్నారు.

Next Story