పట్టపగలు మూడు ఊర్లలో దొంగతనాలు

by Ratna Kumari |

ప‌ట్ట‌ప‌గలు కేవ‌లం గంట‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే మూడు ఊర్ల‌లో.. మూడిళ్ల‌లో దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డారు దుండ‌గులు.

పట్టపగలు మూడు ఊర్లలో దొంగతనాలు
X

దిశ, పెద్ద కొత్త పల్లి : ప‌ట్ట‌ప‌గలు కేవ‌లం గంట‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే మూడు ఊర్ల‌లో.. మూడిళ్ల‌లో దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డారు దుండ‌గులు. ఇంట్లో ఎవ్వ‌రూ లేని విష‌యాన్ని గ్ర‌హించి మొత్తం 8 తులాల బంగారం, 80 తులాల వెండి, న‌గ‌లు, రూ.10వేల న‌గదును ఎత్తుకెల్లారు. వీటి విలువ సుమారు రూ.17.80 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలిపారు. గంట‌న్న‌ర వ్య‌వ‌ధిలో వ‌రుస‌గా దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన సంఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న పోలీసుల‌కు స‌వాల్ గా మారింది. పెద్ద కొత్త‌ప‌ల్లి మండ‌ల కేంద్రంతో పాటు పెద్ద కార్పాముల, చిన్న కార్పుముల గ్రామాల్లో చోటు చేసుకున్నాయి.


దొంగ‌త‌నాల తీరును ప‌రిశీలించిన‌ట్ట‌యితే.. తొలుత రెక్కీ నిర్వ‌హించిన త‌రువాత ఇంటిలో ఎవ్వ‌రు లేనిది చూసి తాళాలు తొల‌గించి దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డ్డారు. పెద్ద కొత్త పల్లి లో నూతనంగా ఇల్లు నిర్మించుకున్న (దేవుని తిరుమలాపూర్ గ్రామవాసి) చొప్పరి బాలస్వామి కుటుంబీకులు మామిడి కాయలు కోయడానికి వెళ్లారు. ఎవ్వరూ లేనిది చూసి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 2తులాల బంగారు,15 తులాల వెండినగలు అపహరించుకపోయినట్లు బాధితుడు చొప్పరి బాలస్వామి తెలిపారు. ఆ తర్వాత పెద్ద కార్పాముల గ్రామంలో కాళ్ల లక్ష్మయ్య ఇంటి లో 3తులాల బంగారం,50 తులాల వెండి నగలు, రూ,3వేలు దోచుకవెళ్లినట్లు బాధితుడు కాళ్ల లక్ష్మయ్య తెలిపారు. అలాగే చిన్న కార్పాముల గ్రామంలో పూజారి బంగారయ్య ఇంట్లో 3 తులాల బంగారం,15 తులాల వెండి, రూ,7 వేలు నగదును ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. పట్టపగలు వరుసగా దొంగతనాలు జరగడంతో కొల్లాపూర్ సీఐ మహేష్, పెద్ద కొత్త పల్లి ఎస్సై సతీష్ తోపాటు వేలిముద్రల నిపుణుల తో దొంగతనాలు జరిగిన ఇళ్లలో వేలిముద్రలను సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. బాధితులను పోలీసులు పెద్ద కొత్త పల్లి పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఫిర్యాదు తీసుకున్నారని తెలిసింది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story