Kalwakurthy: అనుచరులతో భేటీ.. ఎమ్మెల్సీ కసిరెడ్డి సంచలన నిర్ణయం

by Disha Web Desk 16 |
Kalwakurthy: అనుచరులతో భేటీ.. ఎమ్మెల్సీ కసిరెడ్డి సంచలన నిర్ణయం
X
  • ప్రజాభిప్రాయం మేరకే పార్టీ మారే నిర్ణయం
  • భవిష్యత్తు రాజకీయాలపై సమాలోచనలు
  • ప్రగతి భవన్​లో మంత్రి కేటీఆర్​‌తో​ మాట్లాడిన అంశాల ప్రస్తావన
  • కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మార్పు నిర్ణయం
  • ఎమ్మెల్సీ నిర్ణయాన్ని స్వాగతించిన అనుచరవర్గం

దిశ, డైనమిక్ బ్యానర్ స్టోరీ: కల్వకుర్తి నియోజకవర్గ రాజకీయం మరింత రసకాందయంగా మారింది. గత కొన్ని రోజులగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ మార్పుపై వస్తున్న ఊహగానాలకు నేటితో చెక్​పడింది. శుక్రవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తన నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భవిష్యత్తు రాజకీయాలు, పార్టీ మార్పుపై వారితో సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ మార్పు విషయం కార్యకర్తలతో ప్రస్తావించారు. కల్వకుర్తి ప్రాంత అభివృద్ధే తన అభిమతమని అందుకే రాజకీయాలకు వచ్చానని ఆయన వెల్లడించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఐదేళ్ల నుంచి పార్టీలో వర్గాల నేపం పెట్టి అభివృద్ధికి ఆటంకాలు, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల పంపిణీలో అన్యాయం జరగడం తనను తీవ్ర కలతకు గురిచేసిందని ఆయన ఆవేదన వెల్లిబుచ్చారు. నియోజకవర్గంలో 80 శాతం ప్రజల అభిష్టం మేరకు తాను కల్వకుర్తి ఎమ్మెల్యే బరిలో నిలబడాలని నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. కార్యకర్తల అభిప్రాయం, ప్రజా సంక్షేమం కోసం పార్టీ మారుతున్నట్లు చేప్పారు. అయితే ఎమ్మెల్సీ కసిరెడ్డి మాత్రం ఎక్కడ ఏ పార్టీలోకి చేరబోతున్నారని వెల్లడించకపోవడం గమనార్హం. అనుచరులు, కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్​ నుంచి ఎమ్మెల్సీ బరిలో ఉంటారని జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ప్రగతిభవన్​కు బైబై చెప్పిన ఎమ్మెల్సీ

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్​ మెజార్టీ అసెంబ్లీ స్థానాలను సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు కేటాయించారు. పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ ​కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై ఎమ్మెల్సీకి హామిస్తూ వచ్చారు. అదిష్టానం నిర్వహించిన పలు సర్వేలు కుడా ఎమ్మెల్సీకి అనుకూలంగా రావడంతో ఈసారి పక్కా టికెట్ ​వస్తుందని అదిష్టానంపై ఎమ్మెల్సీ ఎంతో ధీమాగా ఉన్నారు. సీఎం కేసీఆర్​ మళ్లీ జైపాల్​ యాదవ్​కే టికెట్​ను కన్ఫామ్ ​చేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రెండు దఫాలుగా సీటు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ కసిరెడ్డి రెండు నెలలుగా తర్జనభజనలు పడ్డారు. రెండు దఫాలుగా కల్వకుర్తి సీటుపై కన్నెసిన ఎమ్మెల్సీ విన్నపాన్ని పార్టీ ఆధిష్టానం రాజకీయ సమీకరణాలతో పక్కకు పెట్టింది. అయితే ఎమ్మెల్సీని పార్టీ మారకుండా పార్టీ ఆదిష్టానం రంగంలో దిగి బుజ్జగింపు పర్వాలకు తెరతీసింది. మంత్రి హరీశ్​

రావు, శ్రీనివాస్​గౌడ్​, వేముల ప్రశాంత్​రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలు ఎమ్మెల్సీతో ప్రత్యేకంగా సమావేశం అయి సీఎం కేసీఆర్​ నిర్ణయాన్ని వెల్లడించారు. పార్టీ మారొద్దని ఆయన సలహాలు, సూచనలు చేశారు. అయినా ఎమ్మెల్సీ మౌనముద్ర పాత్రను పోషించారు. దీంతో ఎమ్మెల్సీ అంతరంగం ఎరిగిన మంత్రి కేటీఆర్​ రంగంలోకి స్వయానా దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రగతి భవన్​ కేంద్రంగా ఎమ్మెల్సీని, ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​ మధ్య రాజీ కుదిరేలా శతవిధాలుగా ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. తన భవిష్యత్తు ముఖ్యం కాదని తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తాను పార్టీమారే నిర్ణయం తీసుకొన్నానని తన విజ్ఙప్తిని ఆలకించాలని గురువారం సాయంత్రం మంత్రి కేటీఆర్​కు విన్నవించి ప్రగతిభవన్‌కు బైబై చెప్పి ​ఆయన తిరుగుముఖం పట్టారు.​

Next Story

Most Viewed