ఉమ్మడి పాలమూరుకు కర్ణాటక ఎన్నికల తాకిడి

by Dishafeatures2 |
ఉమ్మడి పాలమూరుకు కర్ణాటక ఎన్నికల తాకిడి
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఉమ్మడి పాలమూరు జిల్లాపై పడుతోంది. జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలతో పాటు, కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు కర్ణాటకలోని రాయచూర్, యాద్గిర్ జిల్లాలకు సమీపంలో ఉన్నాయి. కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లాలో విందులు, వినోదాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి హోటళ్లు, లాడ్జిలు కర్ణాటక నుంచి వచ్చి పోయే వారితో రద్దీగా మారుతున్నాయి. స్వామికార్యం, స్వకార్యం అన్నట్లుగా రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాల్లోని దేవాలయాలలో ప్రత్యేక పూజల పేర్లతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల పుణ్యమా అని మద్యం విక్రయాలు పెరిగిపోయాయి.

ఈ సందర్భంగా స్వామికార్యం స్వకార్యం అన్నట్లుగా కర్ణాటక రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాలలో పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున వారి వారి ప్రధాన మద్దతు దారులు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలుచోట్ల ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాయచూరు గ్రామీణ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి ప్రచారం ముగించుకుని పెద్ద ఎత్తున జనానికి విందులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా కేటి దొడ్డి మండలం ఇరికిచేడు గ్రామంలో పెద్ద ఎత్తున సభ నిర్వహణకు ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు పోలీసుల నుంచి ఎటువంటి అనుమతులు కూడా తీసుకోలేదు. విషయం జిల్లా పోలీసు ఉన్న అధికారుల దృష్టికి వెళ్లడం, వారు అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో సభను నిర్వహించకుండా అడ్డుకున్నారు. ఇలా బహిరంగంగానే కాకుండా బృందాలుగా కూడా వచ్చి సరిహద్దు ప్రాంతాలలో విందులు చేసుకొని ప్రచారాలు చేస్తున్నట్లు సమాచారం.

పెరిగిన మద్యం విక్రయాలు

కర్ణాటక ఎన్నికల పుణ్యమా అని మక్తల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల , కొడంగల్ ప్రాంతాలలో మద్యం విక్రయాలు మరింతగా పెరుగుతున్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో ఉన్న జనం అప్పుడప్పుడు మద్యం కోసం ఇక్కడికి వస్తున్నప్పటికీ ఎన్నికల వచ్చిన తరుణంలో మరింత ఎక్కువమంది ఇక్కడికి వస్తున్నారు. మరి కొంతమంది లాడ్జిలలో ఉంటూ పలువురు పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికలలో డబ్బుల పంపిణీ కోసం నోట్ల మార్పిడీలు చేసుకుంటున్నారు. 2000, 500 రూపాయల నోట్లను తీసుకువచ్చి ఈ ప్రాంతాల నుంచి 50, 100, 200 రూపాయల నోట్లను తీసుకొని వెళుతున్నారు. రానున్న రోజులలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి కార్యక్రమాలను నివారించకుంటే కర్ణాటక రాజకీయాల ప్రభావం మరింత పడే అవకాశం ఉంది.



Next Story

Most Viewed