వడ్డేపల్లి మున్సిపాలిటీపై ఎగిరిన ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ జెండా

by Bhoopathi Nagaiah |

వడ్డేపల్లి మున్సిపాలిటీపై ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ఆ పార్టీ గెలుచుకున్న ఏకైక సీటే ఇదే..

వడ్డేపల్లి మున్సిపాలిటీపై ఎగిరిన ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ జెండా
X

దిశ, అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ప్రధాన పార్టీలను వెనక్కినెట్టి, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో మంజుల, సారమ్మలు ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు.

రాష్ట్ర చరిత్రలోనే అరుదైన విజయం

తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ ఒక మున్సిపాలిటీని గెలుచుకోవడం ఇదే ప్రథమం. మాజీ జడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు వ్యూహచతురతతో, ఆయన వర్గం 10 వార్డులకు గాను ఏకంగా 8 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఎన్నికైన నూతన పాలకమండలి

ఎన్నికల అధికారులు సోమవారం పాలక వర్గాన్ని ఎన్నుకుని, ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా 4వ వార్డు కౌన్సిలర్ మంజుల, 2వ వార్డు కౌన్సిలర్ సారమ్మ అలియాస్ సారంద వైస్ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలోని పది వార్డుల్లో ల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ - 8, కాంగ్రెస్ - 1, బీఆర్ఎస్ - 1 కౌన్సిలర్‌గా విజయం సాధించారు. మెజారిటీ కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఏఐఎఫ్బీ అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు.

ఆకట్టుకున్న వ్యక్తిగత ఇమేజ్...

పార్టీల కంటే వ్యక్తిగత ఇమేజ్, అభివృద్ధిపై నమ్మకంతో ప్రజలు వడ్డేపల్లి శ్రీనివాసులు వర్గానికి పట్టం కట్టారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లు మాట్లాడుతూ, వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story