ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి నేడో రేపో సీబీఐ నోటీసులు: ఆచారి షాకింగ్ కామెంట్స్

by Dishanational1 |
ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి నేడో రేపో సీబీఐ నోటీసులు: ఆచారి షాకింగ్ కామెంట్స్
X

దిశ, నాగర్ కర్నూల్: పూర్వం బందిపోటు దొంగలు గ్రామాల మీద పడి అడ్డగోలుగా దోచుకున్నట్లు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పాలకులు ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచుకుంటున్నారని, ప్రస్తుతం అక్రమాస్తులు పోగు చేసిన వారి జాబితాలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా ఉన్నాడని, నేడో రేపో సీబీఐ నోటీసులు ఇవ్వనున్నట్లు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ధరణి పోర్టల్ రద్దు రుణమాఫీ అంశంపై కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్రమాస్తులు పోగుచేసినవారి లిస్టులో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేరారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పోగుచేసిన నల్లధనాన్ని బట్టల దుకాణం ద్వారా తెల్ల డబ్బుగా మారుస్తున్నాడని, సుమారు పదివేల కోట్ల రూపాయలు దండుకున్నాడని ఆరోపించారు. ఇవన్నీ విషయాలు సీబీఐకి అందాయని, నేడో రేపో ఆయన గారికి కూడా నోటీసులు అందే అవకాశం ఉందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ఏకైక శాఖ ఎక్సైజ్ శాఖ అని, తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వస్తే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి ఇవ్వాలని సెటైర్ వేశారు. నీళ్లు.. నిధులు.. నియామకాల పేరుతో ఉద్యమం ముసుగులో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి ధరణి సాఫ్ట్ వేర్ తీసుకొచ్చి వేల ఎకరాలను సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. మరోసారి కేసీఆర్ గెలిస్తే గ్రామాల్లో ఎవరి పేరా భూములు ఉండవన్నారు. ఎవరైనా సమస్యలపై ప్రశ్నిస్తే వెంటనే వారిపై దాడి చేసేందుకు పోలీస్ శాఖను వాడుకుంటున్నాడని ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసును సీబీఐకి అప్పగించడంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు లేకుండా ఉందన్నారు. వారితోపాటు రాష్ట్ర ప్రధాకార్యదర్శి బంగారు శృతి, కట్టా సుధాకర్ రెడ్డి, నరేంద్ర రావు, సుబ్బారెడ్డి, దిలీప్ చారి, నాగరాజు, కొండల్ రెడ్డి, రేనయ్య, శ్రీకాంత్ భీమా, మంగ్య నాయక్, జలాల్ శివుడు, వివిధ జిల్లా స్థాయి కార్యకర్తలు, మండల స్థాయి కార్యకర్తలు, బూత్ స్థాయి కార్యకర్తలు, వివిధ మోర్చల కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed