గద్వాలలో వీధికుక్కల స్వైరవిహారం.. 15 మందిపై దాడి

by Kodari Anjali |

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచెడు ప్రాంతంలో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి.

గద్వాలలో వీధికుక్కల స్వైరవిహారం.. 15 మందిపై దాడి
X

దిశ, గద్వాల క్రైమ్: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచెడు ప్రాంతంలో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. పిచ్చికుక్క దాడిలో ఏకంగా 15 మంది తీవ్రంగా గాయపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం, జమ్మిచెడు పరిసరాల్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా ప్రత్యక్షమైన కుక్క దారిలో వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లింది. చిన్న పిల్లలు, వృద్ధులు అని తేడా లేకుండా అందరినీ విచక్షణారహితంగా కరిచింది. ఈ ఘటనలో గాయపడిన బాధితులందరినీ హుటాహుటిన చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా కుక్కల దాడి జరగడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు, ప్రమాదకరంగా మారిన ఆ కుక్కను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో కుక్కల దాడి జరగడంతో స్థానికులు మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. వీధికుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరుతున్నారు.

Next Story