విమర్శలు.. ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్

by Dishanational1 |
విమర్శలు.. ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పాలమూరు నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన రాజకీయాలకు వేదికన రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ మాజీ మంత్రులు, బీజేపీ నేతలు డీకే అరుణ, పి చంద్రశేఖర్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం పొలిటికల్ హీటెక్కిస్తోంది. రాజకీయంగా మాత్రమే కాకుండా... వ్యక్తిగతంగాను విమర్శలు చేసుకోవడం... ఒక్కసారిగా చర్చలకు దారితీస్తోంది... అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ తాతంగం రాజకీయ పార్టీలలో దుమారం రేపుతోంది. ఇన్నాళ్లు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో పాటు.. కొంతమంది యువ నాయకులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై విమర్శలు చేస్తూ వచ్చారు.. ఈ క్రమంలో వారు చట్టపరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. అడపాదడపా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాలమూరులో జరుగుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఘాటు విమర్శలు చేయడం.. ఆ వెంటనే అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది.. అయినప్పటికీని ఈ అంశాలను జిల్లా ప్రజలు రాజకీయ కోణంలోనే చూస్తూ వచ్చారు తప్ప... వ్యక్తిగత విమర్శలుగా భావించలేదు.. కానీ ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రులు డీకే అరుణ, పి చంద్రశేఖర్ పరస్పరం చేసుకుంటున్న విమర్శలు కాక రేపుతున్నాయి.

ఇటీవల మాజీ మంత్రులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యానాలు:

ఇటీవల స్ట్రీట్ కార్నర్ సమావేశాలలో భాగంగా పాలమూరు.. జడ్చర్లలో జరిగిన సమావేశాలలో మాజీమంత్రి డీకే అరుణ తన ప్రసంగాలలో రాష్ట్ర, కేంద్ర రాజకీయాలను ప్రస్తావిస్తూనే.. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను టార్గెట్గా చేస్తూ ప్రసంగించారు. మున్సిపల్ కమిషనర్ గా పనిచేసే సమయంలో పలు ఆరోపణలతో అరెస్ట్ అయ్యారని, మంత్రి బంధువులు ఎక్కడికి అక్కడ భూ దందాలు చేస్తూ... ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. మరో మాజీమంత్రి, బీజేపీ నేత పి చంద్రశేఖర్ సైతం.. ఎవరు ఊహించని విధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఘాటైన విమర్శలు చేశారు. తాము చేసిన అభివృద్ధి పనులకు అధికార పార్టీ నేతలు శిలాఫలకాలు వేసుకున్నారని. తమ హయాంలో కోయిల్ సాగర్ నుండి పాలమూరుకు తాగునీరు వచ్చిందని చెప్పుకొచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి చేశాను అని చెబుతున్నాడు.. తాము స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పెడితే ఎందుకు భయపడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన రోజులలో ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసులు పెట్టలేదు. జైలుకు పంపలేదు... ఈ మంత్రి మాత్రం సొంత పార్టీ వాళ్ళని జైలుకు పంపించాడని ఆరోపించారు.. తాము అవుట్ డేటెడ్ లీడర్లము... వైన్ ఎంత మగ్గితే అంత కిక్ ఇస్తుంది అన్నట్లుగా.. తమ అనుభవం కూడా రాజకీయాలకు కిక్కిస్తుందంటూ చెప్పుకొచ్చారు.

మాజీ మంత్రులపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి...

గత కొన్ని రోజుల నుంచి మాజీ మంత్రులు, ఇతర నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా విమర్శిస్తూ వస్తున్నారు.. ఓ మాజీ మంత్రి భర్త కాంట్రాక్ట్ తీసుకుని భూత్పూర్, పాలకొండ, పాలమూరు వద్ద నిర్మించవలసిన బ్రిడ్జిలను ఇప్పటివరకు పూర్తి చేయలేదని.. మంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ నాయకులు నీళ్లను తరలించకపోతుంటే మంగళ హారతులు పట్టి... ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే చిచ్చు రేపటానికి వస్తున్నారంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ఉద్దేశించి పలు సందర్భాలలో అన్నారు. మూడు రోజుల క్రితం ఐటీ సెంటర్ వద్ద మాజీ మంత్రి పి చంద్రశేఖర్, డీకే అరుణను ఉద్దేశిస్తూ అవుట్ డేటెడ్ లీడర్లు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక కండ్లల్లో మన్ను పోసుకుంటున్నారు... అటువంటి వారిని తరిమి కొట్టాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల ధరల నిరసనగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు జరుగుతూనే... మాజీ మంత్రులపై మరో మారు ఘాటు విమర్శలు చేశారు.. కొంతమంది కలర్లు వేసుకుని... మేము యువ లీడర్లము అన్నట్లుగా... నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించారా.. పరిశ్రమలు స్థాపించారా..!? సాగునీళ్లు తెచ్చారా..!? ఏం ఒరగపెట్టారు అని మంత్రి ప్రశ్నించారు. కులాలు... మతాల పేరుతో రాజకీయాలు చేసే వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి చెప్పారు.

గమనిస్తున్న జనం:

గత రెండు మూడు వారాలుగా మంత్రి వర్సెస్ మాజీ మంత్రుల మధ్య జరుగుతున్న పరస్పర విమర్శలు నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకరిని మించి మరొకరు... ఘాటుగా చేసుకుంటున్న విమర్శలు... ప్రజలలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. రానున్న రోజులలో విమర్శలు.. ప్రతి విమర్శలు మరింత జోరు అందుకుని.. ఎన్నికల సమయానికి పరాకాష్టకు చేరి.. ఆ ప్రభావం ఎన్నికలపై చూపేలా ఉండడం ఖాయం అని పలువులు రాజకీయ నిపుణులు అంటున్నారు.



Next Story

Most Viewed