దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

by velandi.Saikiran |

శేరిపల్లిలో ఈ నెల 17న జరిగిన చోరీ సంఘటనలో ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు భూత్పూర్ సీఐ రామకృష్ణ వెల్లడించారు.

దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
X

దిశ, భూత్పూర్ : మండల పరిధిలోని శేరిపల్లి (హెచ్) గ్రామంలో ఈ నెల 17న జరిగిన చోరీ సంఘటనలో ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు భూత్పూర్ సీఐ రామకృష్ణ వెల్లడించారు. శనివారం తన చాంబర్ లో ఎస్సై నాగన్నతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 17న మధ్యాహ్నం శేరిపల్లి గ్రామంలో నర్సింలు ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన‌ట్లు సిఐ తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్సై నాగన్న ఆధ్వర్యంలో కానిస్టేబుళ్ళు నాగరాజు, రాఘవేందర్ సీసీ కెమెరాల కెమెరాల సహకారంతో దొంగలను గుర్తించార‌ని సిఐ రామకృష్ణ తెలిపారు.

బాదేపల్లి నిమ్మబావి గడ్డ ప్రాంతానికి చెందిన దాదాపుగా 50కి పైగా దొంగతనాలు చేసిన బొంతల మూర్తి, అదే ప్రాంతానికి చెందిన మహమ్మద్ ముస్తఫా ఇద్ద‌రూ క‌లిసి దొంగ‌త‌నం చేసిన‌ట్లు సిఐ వెల్లడించారు. శనివారం భూత్పూర్ చౌరస్తాలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతుండగా వాళ్ల‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింది. ఇక‌ వారి నుండి సొమ్ము రికవరీ చేశామ‌ని సిఐ వెల్లడించారు. దొంగతనం జరిగిన రెండు రోజులలోనే కేసును ఛేదించినందుకు ఎస్సై నాగన్న, కానిస్టేబుళ్ల‌ను అభినందించి రివార్డులను ప్రకటించారు.

Next Story