మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

by Nallavelli.Anjaneyulu |

మున్సిప‌ల్ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇవాళ విడుద‌లైన విష‌యం తెలిసిందే. అయితే బుధవారం నుండి ప్రారంభమ‌య్యే మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు.

మున్సిపల్ ఎన్నికలను  విజయవంతంగా నిర్వహించాలి :  కలెక్టర్ విజయేందిర బోయి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మున్సిప‌ల్ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇవాళ విడుద‌లైన విష‌యం తెలిసిందే. అయితే బుధవారం నుండి ప్రారంభమ‌య్యే మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ జానకి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లకు ఎన్నికలపై అవగాహన ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పిదాలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా ఆయా జిల్లాల ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలోని మహబూబ్ నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో నామినేషన్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోని నామినేషన్ ఫారం లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లు, రిసెప్షన్ సెంటర్ లు, స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ హాల్ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాలు, రూట్ లు క్షేత్ర స్థాయిలో సందర్శించి ఏర్పాట్లు పక్కాగా చేసుకోని, బ్యాలెట్ బాక్స్ లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. రిసెప్షన్ సెంటర్ కు వచ్చే బస్సులు పార్కింగ్ ఏర్పాట్లు, కౌంటింగ్ కు పార్కింగ్ ఏర్పాట్లు చూసుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల పరంగా పోటీ చేసే అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేసేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు నియమించనున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పి సీఈవో వెంకటరెడ్డి, మహబూబ్ నగర్ కార్పొరేషన్ కమిషనర్ రామానుజల రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story