మూడోసారి సీఎంగా కేసీఆర్ ను గెలిపిద్దాం: మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 11 |
మూడోసారి సీఎంగా కేసీఆర్ ను గెలిపిద్దాం: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి: తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం సాధించి, ప్రజల అభ్యున్నతే పరమావధిగా పరిపాలన అందించిన కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో మూడోసారి సీఎంగా గెలిపిద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మి కృష్ణ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గం స్థాయి ప్రతినిధుల కోర్ కమిటీ సమావేశానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఎగరేసి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ అమలు చేయాల్సిన తీర్మానాలను జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ప్రవేశపెట్టగా, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, బీఆర్ఎస్ ప్రతినిధులు బలపరుస్తూ ఆమోదించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక లక్ష్యంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో గత ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో మైలురాళ్లను దాటామన్నారు. ప్రజల అభిష్టం మేరకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తూ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచామన్నారు. భావి తరాల భవిష్యత్ నిర్మాణం కోసం క్షేత్ర స్థాయి కార్యకర్తల నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ప్రతి ఒక్కరూ మూడో సారి తెలంగాణ సీఎంగా గెలిపించేందుకు కంకణ బద్ధులై పనిచేయాలన్నారు. ప్రజలు మొదటిసారిగా భారీ మెజారిటీతో తనకిచ్చిన ఎమ్మెల్యే పదవినీ వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు పనిచేసి సాధించిన గౌరవం, ఖ్యాతి, మార్పును ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ప్రజలకు వివరించాలన్నారు.

ప్రస్తుత రాజకీయాలలో ప్రజలకు తాము ఏంది? ఏమి చేస్తాం? అనీ చెప్పాల్సింది పోయి ఎదుటి వారిపై బురద చల్లడం, నిందలు వేయడంతో లబ్ధి పొందాలన్నా దుస్థితిలో కొంతమంది నాయకులు ఉన్నారని విమర్శించారు. ప్రజా క్షేత్రంలో ప్రజా ఆమోదమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కరుణ శ్రీ, జిల్లా పార్టీ శిక్షణా కమిటీ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు గౌని బుచ్చారెడ్డి, లక్ష్మారెడ్డి, ఎత్తం రవి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed