పత్రీజి ఆశయాలను సాధిద్దాం: మారం శివ ప్రసాద్

by Disha Web Desk 11 |
పత్రీజి ఆశయాలను సాధిద్దాం: మారం శివ ప్రసాద్
X

దిశ, మహబూబ్ నగర్: ధ్యాన గురువు పత్రీజీ ఆశయాలను సాధించాలని పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మారం శివ ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ సమీపంలోని ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ధ్యానం చేయడం, శాకాహారం మాత్రమే భుజించడం, శాంతం, సహనం, ఏకాగ్రతలు సాధించడమే పిరమిడ్ జగత్ పత్రీజీ లక్ష్యమని, అందుకోసం అందరూ కృషి చేయాలని అన్నారు. జిల్లా కేంద్రంలో పిరమిడ్ నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ రూ. 10 లక్షల నిధులు మంజూరు చేశారని, వచ్చే ఏడాదికంతా నిర్మాణం ఏర్పాటవుతుందని ఆయన అన్నారు.

ఆమన్ గల్ దగ్గరలోని కడ్తాల్ మహేశ్వర పిరమిడ్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ధుతామని అన్నారు. అంతకుముందు పద్మావతీకాలనీ నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ, మూగ జీవాలను చంపరాదని, అన్ని జీవుల్లో దైవత్వం ఉంటుందని, శాఖాహరమే భుజించాలని మైక్, కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల జిల్లాల ట్రస్టుల అధ్యక్షులు చెన్నకేశవులు, రామకృష్ణ, సాయిబాబా, ప్యాట్రిన్ వైడి గుప్తా, సత్యనారాయణరాజు, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed