బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలి : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

by Ratna Kumari |   (  Updated:2026-05-30 16:53:57  IST  )

బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు.

బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలి : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్
X
దిశ, కందనూల్ : బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 25 నుంచి 30 వరకు నిర్వహించిన మహిళా వారోత్సవాలు నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో శనివారం ముగిశాయి. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో స్నేహ కిషోర బాలికల మాక్ పార్లమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మాక్ పార్లమెంట్ హైలైట్స్

స్నేహ కిషోర బాలికల సంఘాల ప్రతినిధులు వివిధ రాజ్యాంగ పదవులు స్వీకరించి చర్చలు నిర్వహించారు. రాష్ట్రపతిగా జ్ఞానేశ్వరి, లోక్‌సభ స్పీకర్‌గా యమున, ప్రధానమంత్రిగా నందిని, ప్రతిపక్ష నాయకురాలిగా నిఖిత, డిప్యూటీ స్పీకర్‌గా ప్రియాంక బాధ్యతలు నిర్వర్తించారు. హోం, ఆరోగ్యం, విద్య, గ్రామీణ అభివృద్ధి, మహిళా భద్రత, బాల్య వివాహాల నివారణ అంశాలపై బాలికలు సూచనలు చేశారు.

నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి : కలెక్టర్

బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, స్థానిక సమస్యల పరిష్కారానికి నాయకత్వంగా వ్యవహరించేలా ప్రోత్సహించడమే వారోత్సవాల లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. దూరప్రాంత బాలికలు బస్సులు లేక చదువుకు దూరమవుతున్నామని చెప్పడంతో, కిషోర బాలికలకు సైకిళ్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. మహిళా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, పీడీ డీఆర్‌డీఏ చిన్న ఓబులేసు పాల్గొన్నారు.

Next Story