కేసీఆర్.. ఇథనల్ కంపెనీ.. నీ ఫాంహౌస్ లో పెట్టుకో: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం

by Disha Web Desk 1 |
కేసీఆర్.. ఇథనల్ కంపెనీ.. నీ ఫాంహౌస్ లో పెట్టుకో: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం
X

దిశ, అమరచింత: ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే, ఇథనల్ కెమికల్ ఫ్యాక్టరీ కేసీఆర్ ఫాంహౌస్ లో పెట్టుకోవాలని, చిత్తనూరు లో పెడితే ఊరుకునేది లేదని, తెలంగాణ రాష్ట్ర జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు ఆత్మకూర్ మండల కేంద్రంలో చిత్తనూర్ ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు ఎదిగేందుకు కావల్సిన వనరులను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది పోయి, వారి జీవితాలతో చేలగాటమడడం ఏంటని ప్రశ్నించారు.

ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రమాదకరమైన ఇథనల్ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల, పచ్చని పంట పొలాలను ఎడారిగా మారుతాయన్నారు. ఇథనల్ కంపెనీ వల్ల వ్యవసాయం పై ఆధారపడిన మక్తల్,నారాయణ పేట, దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని 55 గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో గత 11రోజులుగా 55 గ్రామాల ప్రజలు 128 కీ.మీటర్ల మేర పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేస్తుంటే, ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ ఎత్తివేసే వరకు ఈ ప్రాంత ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, కాంగ్రెస్ పార్టీ నారాయణ పేట జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి, మక్తల్ నియోజకవర్గ నాయకులు ప్రశాంత్ రెడ్డి, సీపీఐ వనపర్తి జిల్లా కార్యదర్శి విజయరాములు, బీఎస్పీ దేవరకద్ర ఇన్ చార్జి సంతోష్ రెడ్డి, చిత్తనూర్ యువత, రైతుమండలి, ఎక్లాస్ పూర్ రైతు మండలి, పాలమూరు అధ్యయన వేదిక, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, కుల నిర్మూలన పోరాట సమితి, వ్యవసాయ కార్మిక సంఘం, టీఎఫ్టీయూ, ఏఐ ఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐకెఎస్, ఎస్సీ ఉపకులాల సమితి, బుడగ జంగం హక్కుల పోరాట సమితి, ప్రజా కళా మండలి, బాధిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed