కర్ణాటక వ్యాప్తంగా బంద్…

by Batti.Sumithra |   (  Updated:2026-03-11 06:01:15  IST  )

కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు జరగడంలేదని ఆరోపిస్తూ కర్ణాటక దళిత కుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు.

కర్ణాటక వ్యాప్తంగా బంద్…
X

దిశ, మక్తల్: కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు జరగడంలేదని ఆరోపిస్తూ కర్ణాటక దళిత కుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ నుంచి కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు వెళ్లే వాహనాలను మన రాష్ట్ర సరిహద్దులోని టైరోడ్ సర్కిల్ వద్ద పోలీసులు నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను కర్ణాటకలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక రాయచూరు జిల్లా శక్తినగర్ ఎస్సై నారాయణ మాట్లాడుతూ కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో అన్ని రంగాల్లో రిజర్వేషన్లు సక్రమంగా కొనసాగడం లేదని తెలిపారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా డీఎస్‌ఎస్, జై భీమ్, ఎమ్మార్పీఎస్ కుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కర్ణాటకలో బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కర్ణాటక సరిహద్దులోని రాయచూరు జిల్లా శక్తినగర్ ఎస్సై నారాయణ తన సిబ్బందితో పాటు తెలంగాణలోని మక్తల్ సర్కిల్ సీఐ రామ్‌లాల్, మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి, ఎస్సై రెడ్డి కృష్ణ, ఎస్సై నవీద్, మాగనూరు ఎస్సై రేవతి పోలీసులతో సమన్వయం చేసుకుని రాష్ట్ర సరిహద్దులోని టైరోడ్ సర్కిల్ వద్ద వాహనాలు కర్ణాటకలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. దీంతో తెలంగాణ నుంచి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు, కార్లు, గూడ్స్ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి వైద్య, విద్య, వ్యాపార అవసరాల కోసం ప్రతిరోజూ కర్ణాటకకు వెళ్లే వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.

Next Story