నారాయణపేట జిల్లాలో నేతాజీకి నివాళులు అర్పించకుండా అడ్డుకున్న యువత.. కారణం అదే!

by Web Desk |
నారాయణపేట జిల్లాలో నేతాజీకి నివాళులు అర్పించకుండా అడ్డుకున్న యువత.. కారణం అదే!
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలుఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరగగా.. నారాయణపేట జిల్లా కేంద్రంలో మాత్రం నేతాజీ జయంతి వేడుకలు జరగకుండా వినూత్న రీతిలో యువకులు నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా కేంద్రంలో కొన్ని దశాబ్దాల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ చౌరస్తా నేతాజీ చౌక్ గా ప్రసిద్ధి గాంచింది. చౌక్ వద్ద ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు అనేకం జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో గత ఏడాది రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నేతాజీ విగ్రహం దెబ్బతిన్నది. దీనితో పట్టణానికి చెందిన పలువురు యువకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి స్పందించిన కొందరు ప్రజాప్రతినిధులు, రోడ్డు కాంట్రాక్టర్ కొత్త విగ్రహాన్ని తెప్పించి ప్రతిష్టిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరకపోవడంతో యువత ఆదివారం దెబ్బతిన్న విగ్రహానికి ఎవరు కూడా నివాళులు అర్పించడానికి వీలులేదని పేర్కొంటూ, విగ్రహం చుట్టూ ముసుగులు వేశారు. వాట్సాప్ గ్రూప్‌లో ఒకింత నిరసనలు కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed