జోరుగా ఇసుక అక్రమ రవాణా.. ప్రాణాలు తీస్తున్న మితిమీరిన వేగం

by Disha Web Desk 12 |
జోరుగా ఇసుక అక్రమ రవాణా.. ప్రాణాలు తీస్తున్న మితిమీరిన వేగం
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : జిల్లాలోని దుందుభి వాగు సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా తరలించుకుపోతున్నారు. మార్కెట్‌లో ఒక్కో ట్రాక్టర్ సుమారు రూ.5 నుంచి నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతుండడంతో అధికార పార్టీ చోటా మోటా లీడర్లంతా అక్రమ ఇసుక మాఫియా పైనే దృష్టి సారించారు. దీంతో ఈ వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లతో పగలు రాత్రి తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక రవాణా జరుపుతున్నారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.

అక్రమ రవాణాకు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రతినెలా ఒక్కో ట్రాక్టర్, టిప్పర్ చొప్పున భారీ ముడుపులు చేతులు మారుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇందుకు తెరవెనుక ప్రజాప్రతినిధులు కూడా అధికారులు, మాఫియాకు వెన్నుదన్నుగా ఉన్నట్లు సమాచారం. అలాగే, ఎలాంటి అనుమతులు పొందకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు సహజ వనరును అడ్డగోలుగా దోచుకుంటున్నారు. దీనికి తోడు రోడ్లపై మితిమీరిన వేగంతో ట్రాక్టర్లను డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లు నడపడంతో పలువురు రోడ్డు ప్రమాదంలో బలవుతున్నారు. తీరా ఒక్కో శవానికి కొంత నగదు ముట్టజెప్పి పోలీసు అధికారులతోనే ఆ కుటుంబాలను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇసుక ట్రాక్టర్లకు బలవుతున్నారు అమాయకులు

అనుమతి లేకుండా ఇసుక లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్ ఎవరి కంటా పడకుండా ప్రధాన, గల్లీ రోడ్లలో కూడా మితిమీరిన వేగంతో నడుపుతున్నారు. కనీసం ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో ప్రమాదం జరిగితే బాధితుడు నష్టపోతున్నాడు. సరైన దారి గుండా వెళ్తున్నప్పటికీ అతివేగంతో ఢీ కొట్టడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పట్టుబడ్డ ట్రాక్టర్ కూడా క్షణాల్లోనే బయట పడుతుండడంతో బాధితులే కంగుతింటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.



Next Story

Most Viewed