భార్యాభర్తలు ఆన్యోన్యంగా ఉండాలి.. సామూహిక వివాహాలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 11 |
భార్యాభర్తలు ఆన్యోన్యంగా ఉండాలి.. సామూహిక వివాహాలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: భార్యాభర్తలు కష్ట సుఖాలలో ఒకరికి మరొకరు తోడుగా ఉంటూ ఆన్యోన్యంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం మన్యంకొండ అలివేలు మంగతాయారు దేవాలయం సన్నిధిలో నిర్వహించిన ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఒక వివాహం జరిపించాలంటే ఆడ బిడ్డల తల్లిదండ్రులు పడే ఆర్థిక కష్టాలు వర్ణనాతీతమని, కొందరు తమ కూతురు పెళ్లి కోసం ఆస్తులను అమ్ముకునే పరిస్థితి వస్తున్నదని, అందుకే ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన తల్లితండ్రుల పేర స్థాపించిన శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్,శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు జరిపిస్తున్నామని అన్నారు.

సామూహిక వివాహాల కోసమే ప్రత్యేకంగా కళ్యాణమండపం నిర్మించామని,100 జంటలు ఒకేసారి వివాహాలు చేసుకునేలా ఏర్పాటు చేశామన్నారు. మునులు తపస్సు చేసిన కొండ వద్ద పెళ్లి చేసుకోవడం మహాభాగ్యమని, మహిమాన్వితమైన స్థలంలో ఒకేసారి 21 జంటలకు సామూహిక వివాహాలు జరిపించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది అమ్మవారి దేవాలయం వద్ద ఏసీ కళ్యాణ మండపం నిర్మిస్తున్నామని, ఇక్కడ సామూహిక వివాహాలను అంగరంగ వైభవంగా చేస్తామని తెలిపారు. సామూహిక వివాహాల అనంతరం కొత్త జంటలను 'రోప్' ఏర్పాటు అయిన తర్వాత అందులో కొండపైకి తీసుకెళ్లి స్వామి వారి దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

అలివేలు మంగ దేవాలయం సమీపంలో వచ్చే ఏడాది వరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పెద్ద బడ్జెట్ హోటల్ కం కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామన్నారు. ఇప్పటికే కొండపైన 18 గదుల వసతి సముదాయాన్ని నిర్మించామని, ఇంకా 20 గదుల సముదాయాన్ని కూడా నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డీసీసీబీ చైర్మన్ వెంకటయ్య, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీపీ సుధాశ్రీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed