డీఈఓ కార్యాలయంలో ఆయనే కింగ్ మేకర్..! ఒక్కోపనికి ఒక్కో రేటు..పైసలిస్తేనే ఫైల్ ముందుకు..

by Disha Web Desk 11 |
డీఈఓ కార్యాలయంలో ఆయనే కింగ్ మేకర్..! ఒక్కోపనికి ఒక్కో రేటు..పైసలిస్తేనే ఫైల్ ముందుకు..
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: మంచి విద్యాబుద్ధులు చెప్పి భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు తమ పనుల నిమిత్తం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వెళ్ళక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ పని జరగాలంటే డీఈఓను కలిస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ నారాయణపేటలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోందట. ఎన్నో ఏళ్లుగా విద్యాశాఖ కార్యాలయంలో పాతుకుని పోయిన ఓ కింది స్థాయి అధికారి కింగ్ మేకర్ గా వ్యవహరిస్తున్నారట. ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి ఆ మొత్తాన్ని ముట్టచెప్తే తప్ప కాగితం ముందుకు కదలని పరిస్థితి నెలకొందని టీచర్లు వాపోతున్నారు. ఇక ఎంతటి వారైనా తమ పని అయిపోయిందంటే సాయంత్రానికి దావత్ ఇవ్వాల్సిందేనట. చాలా వరకు ఆర్డర్ కాపీలు కార్యాలయంలో కాకుండా బార్ షాప్ లోనే చేతులు మారుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇక ఆయన పేరు వింటేనే కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ భయమే, కోపిష్ఠిగా పేరున్న ఆయన కార్యాలయంలోని అధికారులపై, అక్కడికి వచ్చే ఉపాధ్యాయులపై నోరు పారేసుకోవడం పరిపాటిగా మారిందట. దీంతో ఆయన జోలికి పోవాలంటే అందరూ జడుసుకుంటారట. సంఘ బాధ్యులైనా సరే ఆయనకు సలాం కొట్టాల్సిందేనట. ఇక సమయపాలన విషయంలో ఆయనకు నచ్చినప్పుడే రావడం, ఇష్టం వచ్చినప్పుడు పోవడం చేస్తుంటారట. బయోమెట్రిక్ ఉన్నప్పటికీ ఆ సమయానికి వచ్చి వేలిముద్ర వేసి వెళ్లడం ఆయనకు అలవాటేనని టీచర్లు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి అయనఫై విచారణ చేసి వ్యవహార శైలిని మార్చడంతో పాటు శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed