దిశ ఎఫెక్ట్.. ఉడిమిల్ల‌లో గుప్త నిధుల త‌వ్వ‌కాలు చేప‌ట్టిన ముఠా అరెస్ట్

by Ratna Kumari |

నాగర్ కర్నూల్ జిల్లా పదరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉడిమిల్ల గ్రామంలో ఈ నెల 24న వినాయకుడి మాన్యం ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాల కలకలం దిశ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

దిశ ఎఫెక్ట్.. ఉడిమిల్ల‌లో గుప్త నిధుల త‌వ్వ‌కాలు చేప‌ట్టిన ముఠా అరెస్ట్
X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా పదరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉడిమిల్ల గ్రామంలో ఈ నెల 24న వినాయకుడి మాన్యం ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాల కలకలం దిశ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గుప్తనిధుల ముఠాను అరెస్టు చేసి శుక్రవారం పదరా పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ఘటనపై సీఐ చంద్రయ్య తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఉడిమిల్ల గ్రామ శివారులోని వినాయకుడి మాన్యం ప్రాంతంలో గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, తవ్వకాల కోసం ఉపయోగించిన జేసీబీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసుల విచారణలో గత కొన్ని నెలలుగా ఉడిమిల్ల గ్రామ అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం వారు అక్రమ తవ్వకాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేశారన్నారు.

గుప్తనిధుల తవ్వకానికి ఉప్పునుంతల గ్రామానికి చెందిన మదనాగుల మల్లయ్య జేసీబీ ఏర్పాటు చేసి అచ్చంపేటకు చెందిన డ్రైవర్ గా పుట్ట మల్లేష్‌ను సంప్రదించగా.. ఆ వ్యక్తి ఐనోల్ గ్రామానికి చెందిన వడ్త్య ధర్మకు చెందిన జేసీబీని ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. జేసీబీ అద్దె కొరకు రూ.15 వేలు ఫోన్ పే ద్వారా అడ్వాన్స్‌గా చెల్లించి వాహనాన్ని సమకూర్చుకున్నారు. వీరికి సహకారిగా ఉడిమిల్ల గ్రామానికి చెందిన మేఘావత్ మోతీలాల్, కాస నాగరాజులను సంప్రదించి తవ్వకాల ప్రాంతం వద్ద ఇతరులకు అనుమానాలు రాకుండా ఇతరులకు అనుమానం రాకుండా కాపలా ఏర్పాటు చేసుకున్నారన్నారు. నలుపు తెలుపు రంగు కారులలో వచ్చి.. ఈనెల 24న రాత్రి సమయంలో నిందితులు ఒక జెసిబి వాహనం, ఒక నలుపు, ఒక తెలుపు రంగు కారులో ఉడిమిల్ల గ్రామ శివారులోని వినాయకుడి మాన్యం ప్రాంతానికి చేరుకొని, అక్కడ కొన్ని పూజలు నిర్వహించిన అనంతరం గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు చేపట్టారన్నారు. అక్కడ సుమారు అరగంట పాటు జేసీబీతో తవ్వకాలు నిర్వహించినప్పటికీ ఎటువంటి గుప్తనిధులు లభించకపోగా అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయి.. మరుసటి రోజు మరోసారి పై నిందితులు అదే ప్రదేశంలో మళ్లీ తవ్వకాలు జరపాలని కుట్రలు చేయడంతో పై విషయమై విశ్వసనీయ సమాచారం అందుకున్న పదర పోలీసులు అమ్రాబాద్ మండలం శ్రీశైలం జాతీయ రహదారి మన్ననూరు చెక్ పోస్ట్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు.

జేసీబీతో పాటు నిందితులు అరెస్ట్..

నేరానికి ఉపయోగించిన జేసీబీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, పట్టుబడిన నిందితుల వివరాలు ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన మదనాగుల మల్లయ్య, కల్వకుర్తి మండలం సుద్ధకల్ గ్రామానికి చెందిన జేసీబీ డ్రైవర్ పుట్ట మల్లేష్, అచ్చంపేట మండలం ఐనోల్ గ్రామానికి చెందిన వడ్త్య ధర్మ, పదరా మండలం ఉడిమిళ్ళ గ్రామానికి చెందిన మేఘావత్ మోతీలాల్, ఫై గ్రామానికి చెందిన కాస నాగరాజు, జెట్టప్ప అరెస్టు చేశామన్నారు. వీరితోపాటు మరికొంతమంది ప్రధాన నిందితులు పరారీలో ఉండగా వారి కొరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. ఈ మీడియా సమావేశంలో పదరా ఎస్సై వినోద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ..గుప్తనిధుల పేరుతో వ్యాపిస్తున్న మూఢనమ్మకాలను నమ్మవద్దని, అటువంటి అక్రమ తవ్వకాల ద్వారా ప్రభుత్వ, అటవీ, దేవాదాయ భూములకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story