ఆత్మహత్య చేసుకుంటాం.. కాంట్రాక్టర్లు ధర్నా

by Disha Web Desk 4 |
ఆత్మహత్య చేసుకుంటాం.. కాంట్రాక్టర్లు ధర్నా
X

దిశ, లింగాల: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల క్యాంటీన్ కు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాల కళాశాల గేట్ ముందు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు తిరుపతి రెడ్డి, అశోక్ మాట్లాడుతూ... గతంలో 2018-19 సంవత్సరానికి గాను పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టెండర్ పద్ధతిన పాలు, కూరగాయలు, పండ్లు, చికెన్, వాటర్ అందజేశామన్నారు. దీనికి సంబంధించి దాదాపు మూడు నెలలకు సంబంధించి 15 లక్షల 59 వేల 413 (1559413) వరకు బిల్లు బకాయి ఉన్నాయని తెలిపారు.

అయితే 2018 నుండి ఇప్పటివరకు బిల్లులు రాలేదని గతంలో పలుమార్లు కలెక్టర్లకు, ఆర్ సిఓ, జెసి స్థానిక ప్రిన్సిపల్ లకు విన్నవించుకున్నామని, విన్నవించుకున్నా ఇంత వరకు బిల్లులు రాకపోవడంతో ధర్నా నిర్వహించామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బిల్లును మంజూరు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, పాఠశాల సొసైటీ పేరు రాసి ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. అనంతరం స్థానిక ప్రిన్సిపల్ వినోద్ ఖన్నా ధర్నా స్థలానికి చేరుకొని పెండింగ్లో ఉన్న బిల్లులను సొసైటీ దృష్టికి తీసుకువెళ్లి మంజూరు అయ్యేవిధంగా ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా ముగించారు. అనంతరం వారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధా ట్రేడర్స్ కిరణం వెంకటేశ్వర్లు, శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ కిరాణం తిరుపతిరెడ్డి, ఎండీ సైదుల్ భాష, అశోక్, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed