నడిగడ్డకు బుల్లెట్ దెబ్బ! హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ ట్రైన్ రూట్ మార్పుపై ఆందోలన

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్ రూట్ మారుతోందనే వార్తలు జోగులాంబ గద్వాల జిల్లా ప్రజల్లో కలకలం రేపుతున్నాయి. గతంలో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, అలంపూర్ మీదుగా 12 స్టేషన్లతో డీపీఆర్ సిద్ధం చేశారు.

నడిగడ్డకు బుల్లెట్ దెబ్బ! హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ ట్రైన్ రూట్ మార్పుపై ఆందోలన
X

హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్ రూట్ మారుతోందనే వార్తలు జోగులాంబ గద్వాల జిల్లా ప్రజల్లో కలకలం రేపుతున్నాయి. గతంలో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, అలంపూర్ మీదుగా 12 స్టేషన్లతో డీపీఆర్ సిద్ధం చేశారు. ఆపరేటింగ్ వేగం గంటకు 320 కి.మీతో 2 గంటల్లో గమ్యం చేరేలా ఎన్‌హెచ్ఆర్‌సీఎల్ ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ, అమనగల్, సోమశిల మీదుగా కొత్త రూట్‌ను పరిశీలిస్తున్నట్లు రావడంతో ఆందోళన మొదలైంది. బుల్లెట్ రైలు గద్వాల మీదుగా వెళ్తేనే పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చి జిల్లా సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రూట్ మార్పు ప్రతిపాదనను విరమించుకుని, పాత మార్గాన్నే కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు.

- దిశ, జోగులాంబ ప్రతినిధి

దిశ, జోగులాంబ ప్రతినిధి : హైదరాబాద్–బెంగళూరు ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ మార్గంలో మార్పులు జరుగుతున్నాయనే వార్తలు జోగులాంబ గద్వాల జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. గతంలో ఈ ప్రాజెక్టును షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, అలంపూర్, కర్నూలు మీదుగా నిర్మించాలని రూట్ ప్రతిపాదించారు. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ కింద సుమారు 618 నుంచి 626 కిలోమీటర్ల పొడవున గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కేవలం 2గంటల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేరుకునేలా 12స్టేషన్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా రూపొందించారు.

కొత్త మార్గంపై తీవ్ర ఆందోళన...

అయితే, ప్రస్తుతం ఈ మార్గాన్ని మారుస్తూ ఫ్యూచర్ సిటీ - అమనగల్ - నల్లమల - సోమశిల మీదుగా కర్నూలుకు వెళ్లేలా ప్రత్యామ్నాయ రూట్‌ను అధికారులు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో స్థానికంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఇప్పటికే అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. ఒకవేళ ఈ బుల్లెట్ ట్రైన్ మార్గం గద్వాల మీదుగానే వెళ్తే జిల్లాకు భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు రావడంతోపాటు రియల్ ఎస్టేట్, విద్య, వైద్య రంగాలు విశేషంగా అభివృద్ధి చెందుతాయని మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో రూట్ మార్చడం నడిగడ్డ ప్రాంత అభివృద్ధిని దెబ్బతీయడమేనని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించి, గతంలో అనుకున్న పాత మార్గాన్నే కొనసాగించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

నడిగడ్డకు తీవ్ర అన్యాయం

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

బుల్లెట్ ట్రైన్ రూట్ మార్పు అనేది నడిగడ్డకు ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. అభివృద్ధిలో ఆమడదూరం ఉన్నా నడిగడ్డకు బుల్లెట్ ట్రైన్ వల్ల పారిశ్రామ్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి జరుగే అవకాశం ఉంది. ఈ మార్పు వల్ల నడిగడ్డకు శారాఘాతం. ముఖ్యమంత్రి పునరాలోచించి నడిగడ్డ మీదుగానే బుల్లెట్ ట్రైన్ వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రజల అగ్రహానికి ప్రభుత్వాలు గురి కావాల్సి ఉంటుంది.

నడిగడ్డకు శాపం

- బీఆర్ఎస్ నేత హనుమంతునాయుడు

బుల్లెట్ ట్రైన్ రూట్ మార్పు కాంగ్రెస్ ప్రభుత్వం నడిగడ్డకు చేస్తున్న తీవ్ర అన్యాయం. రేవంత్ రెడ్డి తన సొంత ఊరికోసం ఇలా ట్రైన్ రూట్ మార్పు ప్రతిపాదన మానుకోవాలి. తన వ్యక్తిగత ఇష్టాలు పక్కన బెట్టి ప్రజల అవసరాల కోసం నడిగడ్డ మీదుగానే బుల్లెట్ ట్రైన్ రూట్ కొనసాగించాలి. నడిగడ్డ ప్రాంతాలైన అలంపూర్, గద్వాల నియోజకవర్గాలు పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో కుంటుపడుతున్నాయి. నడిగడ్డ మీదుగా బుల్లెట్ ట్రైన్ రూట్ వెళ్లాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తాం.

బుల్లెట్ ట్రైన్ రూట్ మార్పు చేస్తే పోరాటం చేస్తాం

- అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

గతంలో బుల్లెట్ ట్రైన్ నడిగడ్డ మీదుగా రూట్ ప్రతిపాదించగా సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల నడిగడ్డకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నడిగడ్డకు తీవ్రంగా నష్టం వాటిల్లే విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ రావడం వల్ల కొంత పారిశ్రమికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నడిగడ్డ ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది.

Next Story