ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు : మాజీ మంత్రి జిల్లేల చిన్నారెడ్డి

by Disha Web Desk 11 |
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు : మాజీ మంత్రి జిల్లేల చిన్నారెడ్డి
X

దిశ, పెద్దమందడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేశాయని మాజీ మంత్రి, పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జిల్లేల చిన్నారెడ్డి అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా జంగమయ్య పల్లె, బలిజ పల్లె, పామీ రెడ్డి పల్లె, వీరయ్య పల్లి తదితర గ్రామాలలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు.

పెట్రోల్, డీజిల్, సిలిండర్ రేట్లను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. రాష్ర్టంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు విసుగు చెందారని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, పెద్దమందడి మండల అధ్యక్షుడు సి .పెంటన్న యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జీ. మన్యం, జిల్లా ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు రోహిత్, మండల యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, జీ. రాజు, కే .గోవింద్, ఎల్లస్వామి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.


Next Story