ప్రభుత్వ భూముల్లో చేపట్టని నిర్మాణాలను రద్దు చేయండి: కలెక్టర్ రవి నాయక్

by Disha Web Desk 11 |
ప్రభుత్వ భూముల్లో చేపట్టని నిర్మాణాలను రద్దు చేయండి:  కలెక్టర్ రవి నాయక్
X

దిశ, మహబూబ్ నగర్: వివిధ ప్రభుత్వ సంస్థల కోసం భూమిని సేకరించి ఇప్పటి వరకు ఇంకా నిర్మాణాలను మొదలు పెట్టని చోట వాటిని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ ఆధేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో తహసీల్దార్లతో రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ధరణి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీ- సేవ, ఈ-ఆఫీసులలో పెండింగ్ లలో ఉన్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

ఈ విషయంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ధరణిలో వివిధ అంశాల కింద పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. తహసీల్దార్ల వారి వారి పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఓటరు జాబితాకు సంబంధించి వివిధ ఫాంలపై వచ్చిన అభ్యంతరాలపై ప్రత్యేక దృష్టి సారించి, క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఆర్డీఓ అనిల్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్ రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి కిషన్ రావు, మైన్స్ ఏడీ విజయకుమార్ ఇతర ఇంజనీరింగ్ శాఖల అధికారులు, తహసీల్దారులు పాల్గొన్నారు.


Next Story