పంచభూతాలను సైతం టీఆర్ఎస్ నేతలు కొల్లగొడుతుండ్రు.. రాణి రుద్రమ

by Dishafeatures2 |
పంచభూతాలను సైతం టీఆర్ఎస్ నేతలు కొల్లగొడుతుండ్రు.. రాణి రుద్రమ
X

దిశ, నాగర్ కర్నూల్: టీఆర్ఎస్ నేతలు పంచభూతాలను సైతం కొల్లగొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండిపడ్డారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో కరువు నేల పాలమూరులో వలసలు ఆగలేదని చెప్పారు. రైతులకు సాగు నీరు అందలేదని, పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ కాలేదని ఆరోపించారు. తాను ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ చారి లాంటి ఎంతోమంది త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే రాజభోగాలు అనుభవిస్తోందని విమర్శించారు. 1200 మంది అమరుల త్యాగాలను కేసీఆర్ తుంగలో తొక్కారని, కనీసం వాళ్ల కుటుంబాలకు ఏమాత్రం సాయం చేయలేదని ఆరోపించారు.

టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, అందినంతా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు, ఇసుక, కొండలు, నీళ్లు.. ఇలా ఒకటేమిటి ప్రకృతిలోని ప్రతిదీ టీఆర్ఎస్ నాయకుల ధన దాహానికి బలై పోతున్నాయని అన్నారు. చివరికి లిక్కర్ దందాలో కూడా అడుగుపెట్టి రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చారని విమర్శించారు. తీవ్ర బాధల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచేందుకే తాము ఈ కార్యక్రమానికి పూనుకొన్నట్లు రాణి రుద్రమ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శ్రుతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ చారి తదితరులు పాల్గొన్నారు.


Next Story