అమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వ్ కోసం ఆదివాసీల త‌రలింపును మానుకోవాలి

by Ratna Kumari |

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా న‌ల్ల‌మ‌ల్ల ఫారెస్ట్ లోని అమ్రాబాద్ మండ‌లంలో మాన‌వ హ‌క్కుల వేదిక‌, ద‌ళిత బ‌హుజ‌న ఫ్రంట్ సంస్థ‌ల‌కు చెందిన ఆరుగురు స‌భ్యుల బృందం సార్ల‌ప‌ల్లి గ్రామంలో ప‌ర్య‌టించారు.

అమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వ్ కోసం ఆదివాసీల త‌రలింపును మానుకోవాలి
X

దిశ, అచ్చంపేట : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా న‌ల్ల‌మ‌ల్ల ఫారెస్ట్ లోని అమ్రాబాద్ మండ‌లంలో మాన‌వ హ‌క్కుల వేదిక‌, ద‌ళిత బ‌హుజ‌న ఫ్రంట్ సంస్థ‌ల‌కు చెందిన ఆరుగురు స‌భ్యుల బృందం సార్ల‌ప‌ల్లి గ్రామంలో ప‌ర్య‌టించారు. ముఖ్యంగా మాన‌వ హ‌క్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి పి.శంకర్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శిడాక్టర్ ఎస్. తిరుపతయ్యతో కలసి ఆరు మంది బృందం వెళ్లింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టైగర్ రిజర్వ్ ప్రాంతం కోసం జరుగుతున్న విస్తాపన, దానికి సంబంధించి జరుగుతున్న ప్రచారంలో ఉన్న అసత్యాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. సార్లపల్లి గ్రామ పంచాయతీ, దాని పరిధిలోని కుడి చింతలబయలు, తాటిగుండల పెంట, వటవర్లపల్లి పంచాయతీ, కొల్లంపెంట గ్రామాలు మొదటి విడతలో విస్తాపనకు గురవుతున్నాయ‌ని ఆ విస్థాపనకు ఆదివాసి తెగలే స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారనే ప్రచారం రెవెన్యూ, అటవీ శాఖలు ముమ్మరంగా చేస్తున్నాయన్నారు.

కొద్ది మంది తప్ప..

ఇప్పటికే స్వగ్రామం వదిలి పట్టణంలో స్థిరపడ్డ అది కొద్ది మంది ఆదివాసీలు తప్ప, దాదాపు ఆదివాసి, గిరిజనులెవ్వరూ వారి స్వగ్రామాలను వదిలి, అక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బాచారం వంటి మైదాన ప్రాంతాల్లోకి వెళ్ళటానికి సిద్ధంగా లేరన్నారు. ఈ మధ్య తాము తరలివెళ్లడానికి సిద్ధం అని తీసిన ర్యాలీ లో పాల్గొన్నది సార్లపల్లి సర్పంచ్ భర్త తప్ప మిగతావారంతా గిరిజనేతరులేఅన్నారు.

ఐదు దశాబ్దాలుగా ఏ ఘర్షణ లేదు..

గత యాభై సం.లుగా పులికీబి అడవుల్లో జీవిస్తున్న మనుషులకు మధ్య అక్కడ ఏ ఘర్షణా జరగలేదనీ, పులి వెళ్ళే దారులు, పులి అలవాట్లు చెంచులకు సాంప్రదాయ పరంగా వచ్చిన జ్ఞానం అని పేర్కొంటున్నారు. ఇది పులికి- మనిషికి మధ్య ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుందనీ పులులను పెద్దమ్మ తల్లిగా కొలుస్తామని, తామెన్నడూ పులులకు హాని చేయలేదని, చేయమని ఆదివాసులు ముక్తకంఠంతో చెబుతున్నారని గుర్తు చేశారు. పులుల సంరక్షణ కోసమని మా జీవించే హక్కుకూ , గౌరవానికీ విలువ ఇవ్వకుండా, మా జీవితాలను చిన్నాభిన్నం చేసే ఈ తరలింపున‌కు మేము వ్యతిరేకమని చెంచు ఆదివాసిలు ప్రకటిస్తున్నారనీ పేర్కొన్నారు. అలా తరలించటం వల్ల షెడ్యూల్డ్ ప్రాంతపు మా హక్కులను కోల్పోతామని, అటవీ ఫలసాయాన్ని పొందే హక్కును, పశువుల మేతకు ఉపయోగపడే అడవిని కోల్పోతామనే బాధను వ్యక్తపరుస్తున్నారని పేర్కొన్నారు. ఆదివాసీలకు తగినంత వ్యవసాయ భూమి ఉందని తరలించడం ద్వారా కొత్త ప్రాంతంలో ఉపాధి దొరకగా అన్యాయానికి గురి అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి చెంచు ఆదివాసి తెగ కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన పీవిటిజి తెగకు చెందిన అట్టడుగు వర్గపు ఆదివాసీ తెగ అంతరించిపోవటానికి సిద్ధంగా ఉన్న ఇటువంటి పై తెగ ప్రజలకు ప్రత్యేక సంరక్షణ అందించాల్సింది పోయి, ఈ రకమైన విధానాలకు పాల్పడటం విచారకరం.

ఇతరులను కూడగడుతూ..

అటవీ అధికారులు అక్రమ పద్ధతిలో గ్రామసభ తీర్మాలను చేయిస్తూ, గిరిజనేతరులను కూడగడుతూ, తరలింపున‌కు అందరూ సిద్ధంగా ఉన్నారని చేస్తున్న ప్రచారం పూర్తి నిజం కాదన్నారు. గ్రామ సభలు ఎక్కడా జరగలేదు. జరిగిన ఒక్క సార్లపల్లిలో డీఎఫ్వో ఆధ్వర్యంలో వారికి అనుకూలంగా ఉన్న కొద్ది మందితో సంతకాలు చేయించుకున్నారనీ ఆరోపించారు. తరలింపున‌కు అనుకూలంగా లేని ఆదివాసులను రెవెన్యూ, పోలీసు, అటవీ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మొత్తం గ్రామాలు స్వచ్ఛందంగా తరలిపోతున్నట్టు, ఆ గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు మొదలగు కొత్త ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తున్నారు. మహిళా సంఘ భవనానికి అనుమతి ఇవ్వటం లేదు. రోడ్లు వేయటం లేదు. ప్రజలను చైతన్యం చేస్తున్న వారిని బెదిరిస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. స్వచ్ఛందంగా వెళ్తామని ముందుకొచ్చిన గిరిజనేతురలతో ఇంగ్లీష్ భాషలో రాసిన అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించుకోడం, 15 లక్షలు ఇస్తామని, భూములు ఇస్తామని , ఇళ్లు కట్టించి ఇస్తామని నోటిమాటగా చెప్పడం అభ్యంతకరం. పేరుకు స్వచ్ఛంద తరలింపు కానీ, వాస్తవంగా ఇది ప్రలోభ పూరిత, బలవంతపు తరలింపఅన్నారు.

ఐదవ షెడ్యూల్ వారికి రక్షణ కవచం..

టైగర్ రిజర్వ్ ప్రాంతం నుంచి గ్రామస్థుల తరలింపున‌కు ప్రభుత్వం చేస్తున్న ఈ రకమైన ప్రయత్నాలను ఈ బృందం ఖండిస్తోందన్నారు. . వన్య ప్రాణుల సంరక్షణ ఎంత అవసరమో.. నిజానికి రాజ్యాంగపరంగా ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన 5 వ షెడ్యూల్లు, పీసా చట్టం,1/ 70 చట్టం అమలు చేయడం అంతే అవసరమన్నారు. ఆదివాసుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే, ఈ రకమైన నిర్లక్ష్యపు ధోరణిని అవలంబించటం సరైంది కాదన్నారు.

ప్రధాన డిమాండ్లు..

1. టైగర్ రిజర్వ్ కోసం ఆదివాసుల విస్తాపనను నిలిపివేయాలి.

2. కోరం తో కూడిన గ్రామసభ తీర్మానాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. తరలింపుకు తాము వ్యతిరేకమని ఆదివాసీ ప్రజలు చేసిన గ్రామసభ తీర్మానాలను ప్రభుత్వం గౌరవించాలి.

3. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో వాళ్లు పొందే హక్కులను పరిరక్షించాలి. పీసా చట్టాన్ని , అటవీ హక్కుల చట్టాన్ని వాటి స్ఫూర్తితో అమలు పరచాలి. వారు ఉన్న ప్రాంతంలోనే విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలను పెంపొందించాలి.

4. విస్తాపనకు సిద్ధంగా లేని ప్రజలపై ప్రత్యక్ష, పరోక్ష వేధింపులను మానుకోవాలి.

5. గ్రామాలను వదిలి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న వారికి ప్రభుత్వం నోటిమాటగా కాకుండా, ఆ హామీలకు చట్టబద్ధత కల్పించి మాత్రమే తరలించాలి ఈ నిజనిర్ధారణ బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళ రోహిత్, సంజీవ్, శ్రీధర్ , భరత్ మరియు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ పాల్గొన్నారు.

Next Story