జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఆశా వర్కర్లు

by Disha Web Desk 12 |
జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఆశా వర్కర్లు
X

దిశ, జడ్చర్ల : ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని 18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడి ధర్నా కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మంగళవారం జడ్చర్ల పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆశా కార్యకర్తలు జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయని ముట్టడించి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ఆశ కార్యకర్తలు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా ఆశా వర్కర్లు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని.. కానీ ఆశ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఫిక్స్డ్ వేతనం రూ. 18000 వేల రూపాయాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.32 రకాల రిజిస్టర్లను ప్రభుత్వమే సప్లై చేయాలని డిమాండ్ చేశారు.

టీబీ,లెప్రసి,కంటి వెలుగు సంబంధించిన తదితర పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని లెప్రసీ సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించి వాలంటీర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేసి ఐదు లక్షల ఆరోగ్య భీమా వర్తింపజేయాలని., తమకు సంబంధంలేని అధనపు పనులను రద్దు చేయాలని, 2021 సంవత్సరంలో ఆరు నెలలు పెండింగ్లో ఉన్న పీఆర్సీ వేతనాలు వెంటనే చెల్లించాలని అన్నారు. ఆశా వర్కర్లకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో తమ డిమాండ్ల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ముట్టడి సచివాలయం ముట్టడి. చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సారికకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆశా కార్యకర్తలు అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దీప్లా నాయక్, ఆశా కార్యకర్తలు అలివేల, శివ లీల, సుగుణమ్మ, సాజిదా, పద్మ, నసీం సుల్తానా, కవిత, అమృత, వైష్ణవి, నీలమ్మ, నియోజకవర్గంలోని ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story