ఏమి అభివృద్ధి చేశారని సీఎం కేసీఆర్ గద్వాలకు వస్తున్నారు.. ఏఐసీసీ కార్యదర్శి

by Disha Web Desk 20 |
ఏమి అభివృద్ధి చేశారని సీఎం కేసీఆర్ గద్వాలకు వస్తున్నారు.. ఏఐసీసీ కార్యదర్శి
X

దిశ, వడ్డేపల్లి / ఉండవల్లి : జోగులంబా గద్వాల జిల్లా ప్రజలకు 9 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పి జిల్లాలో అడుగు పెట్టాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం శాంతినగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్, ఎస్పీ భవన సముదాయాలను ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జిల్లాకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని మండిపడ్డారు. పుష్కర సమయంలో అలాగే ఎన్నికల సందర్భంలో రెండు పర్యాయాలు ఆలంపూర్ కి సీఎం హోదాలో వచ్చి జోగులంబా అమ్మవారి ఆలయాల అభివృద్ధి 100 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి కనీసం 100 రూపాయలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

ఆర్డీఎస్ ఆయకట్టుకు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు ఇస్తానన్నావ్ అలాగే అలంపూర్ లో డిగ్రీ కాలేజీ, మినీ బస్ డిపో, ఫైర్ స్టేషన్, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని అది నిరంతర ప్రక్రియని ప్రగల్భాలు పలికి మాట తప్పారన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో నిర్మిస్తామన్న జూలేకల్, మల్లమ్మ కుంట, వల్లూరు రిజర్వాయర్ల సంగతే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఎంత మందికి డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ నాయకులు షేక్షవాలి ఆచారి, జిల్లా మహిళ నాయకురాలు నాగ శిరోమణి, మండల అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి, జగన్ గౌడ్, దేవేందర్, చిన్నిబాబు, అయిజ మండల అధ్యక్షులు దేవేందర్, మద్దిలేటి, పచ్చర్ల కుమార్, లాల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed