మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థిపై టీచర్ పైశాచికం

by Dishafeatures2 |
మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థిపై టీచర్ పైశాచికం
X

దిశ, అమరచింత: ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల పట్ల టీచర్లు, యాజమాన్యాల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. మార్కులు తక్కువ వస్తే ప్రేమతో మందలించాల్సింది పోయి, విద్యార్థుల పట్ల టీచర్లు పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని ఎస్వీఎస్ ప్రైవేట్ సెంట్రల్ స్కూల్ లో తక్కువ మార్కులు తెచ్చుకున్నాడంటూ ఓ విద్యార్థిపై అక్కడి టీచర్ పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. సదరు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మహ్మద్ ఇస్మాయిల్ అనే విద్యార్థికి తెలుగు యూనిట్ టెస్ట్ లో 5 మార్కులు తక్కువ వచ్చాయి. దీంతో తెలుగు టీచర్ నాగిరెడ్డి చాలా సీరియస్ అయ్యాడు. తక్కువొచ్చిన ఒక్కో మార్కకు 20 చొప్పున మొత్తం 100 గుంజీలు తీయించాడు. దీంతో ఆ విద్యార్థి నడవలేని స్థితిలో ఇంటికి చేరుకున్నాడు. నొప్పి ఎక్కువవడంతో మంచానికే పరిమితమయ్యాడు.


ప్రతి రోజు స్కూల్ కు వెళ్లే తమ అబ్బాయి 4 రోజులుగా మంచం పట్టడంతో తండ్రి సమీయొద్దీన్ ఆరా తీయగా ఆ విద్యార్థి అసలు విషయం చెప్పాడు. ఈ విషయమై పాఠశాల కరస్పాండెంట్ ఖాజాలాల్ ను విద్యార్థి తండ్రి నిలదీయగా.. వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఇస్తా.. విషయాన్ని పెద్దది చేయొద్దని సదరు కరస్పాండెంట్ చెప్పాడని సమాచారం. మార్కులు తక్కువొస్తే వచ్చే పరీక్షల్లో నైనా మంచి మార్కులు తెచ్చుకునేలా ట్రైనింగ్ ఇవ్వాల్సిన ఉపాధ్యాయులు సైకోలా మారి విద్యార్థులను వేధిస్తు్న్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు.



Next Story

Most Viewed