జోరుగా ఇసుక అక్ర‌మ ర‌వాణా.. ఆపేదెవ‌రు..?

by Nallavelli.Anjaneyulu |

ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి లో పట్టపగలే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. కానీ మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు మాత్రం అంటి ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

జోరుగా ఇసుక అక్ర‌మ ర‌వాణా.. ఆపేదెవ‌రు..?
X

దిశ, మిడ్జిల్ : ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి లో పట్టపగలే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. కానీ మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు మాత్రం అంటి ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మండలంలోనీ కొత్తపల్లి గ్రామంలో పట్ట పగలే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నది. సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమార్కులు అదును చూసి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు 20 ఫీట్ల లోతు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని పలు గ్రామాలతో పాటు, ఇతర జిల్లాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రభుత్వ భూమి వివరాలు :

కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో తప్పుడు సర్వే నెంబర్లతో గత ఏడాది పాత అనుమతులతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. వాస్తవంగా అక్కడ ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు ప‌రిశీలించిన‌ట్ట‌యితే.. స‌ర్వే నెంబ‌ర్ 97లో 7:35 ఎక‌రాలు, స‌ర్వే నెంబ‌ర్ 85లో 1:33 గుంటలు, స‌ర్వే నెంబ‌ర్ 95లో 2:21 గుంటలు భూమి, నదినాల 16 ఎకరాల భూమిలో తవ్వకాలు జరిపి ఇసుకను తరలిస్తున్నారు. ఈ సర్వే నెంబర్లు నదిలాల మొత్తం ప్రభుత్వ భూములు. వీటిలో ఎలా ఇసుక పర్మిషన్ పొందారు ? ఎందుకు అదే సర్వే నెంబర్లు అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు . దీనికి సహకరిస్తున్నది ఎవరు ? పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ప్రజలు నది పరిహార ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తక్షణమే స్పందించి అక్కడ ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని రైతులు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసు, రెవెన్యూశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story