ఎంపీకి అనూహ్య పరిణామం.. ఇంకా అక్కడ బీఆర్ఎస్‌గా గుర్తింపు లభించలేదు!

by Disha Web Desk 2 |
ఎంపీకి అనూహ్య పరిణామం.. ఇంకా అక్కడ బీఆర్ఎస్‌గా గుర్తింపు లభించలేదు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన వెంటనే లోక్‌సభ సెక్రటరీకి, రాజ్యసభ చైర్మన్‌కు ఎంపీలు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పటివరకు లోక్‌సభలో బీఆర్ఎస్‌గా గుర్తింపు లభించలేదు. దీనికి తోడు బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ)లో సైతం బీఆర్ఎస్ పేరు జాబితాలోకి ఎక్కలేదు. దీంతో ఇకపైన జరిగే బీఏసీ కమిటీ సమావేశాలకు స్పీకర్ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం ఉంటేనే హాజరవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ తరఫున లోక్‌సభాపక్ష నేతగా నామా నాగేశ్వరరావు హాజరవుతూ ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్‌గా గుర్తించనందున ఆయనను లేదా ఆ పార్టీ తరఫున మరో ఎంపీని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిస్తే మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది.

ఒకవేళ అలాంటి స్పెషల్ ఇన్విటేషన్ లేనట్లయితే హాజరుకావడానికి అవకాశం ఉండదు. ఏదేని ఒక పార్టీకి ఆరుగురి కన్నా ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పుడు బీఎసీ జాబితాలో స్థానం లభిస్తుంది. ఇంతకాలం టీఆర్ఎస్‌కు బీఏసీలో స్థానం ఉన్నా హఠాత్తుగా బుధవారం జరిగిన సమావేశానికి మాత్రం ఊహించని పరిణామం చోటుచేసుకున్నది. జాబితాలో పేరు లేకపోవడంతో స్పెషల్ ఇన్విటేషన్ ప్రకారం సమావేశానికి హాజరుకావాల్సిందిగా నామా నాగేశ్వరరావుకి లోకసభ సచివాలయం సమాచారం ఇచ్చింది. మంత్రిత్వ శాఖలవారీగా డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అంశంపై త్వరలో లోక్‌సభ సమావేశాల్లో చర్చకు తీసుకోవాల్సిన విధానంపై చర్చించేందుకు బుధవారం బీఏసీ సమావేశం ఏర్పాటైంది. దీంతో బీఆర్ఎస్ పేరు బీఏసీ జాబితాలో లేదనే విషయం వెలుగులోకి వచ్చింది.


Next Story

Most Viewed