Lok Manthan : ‘లోక్ మంథన్’ భారతీయ సంస్కృతికి నిదర్శనం : కిషన్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-11-21 16:35:00  IST  )

లోక్ మంథన్ (Lok Manthan)భాగ్యనగర్ 2024 భారతీయ సంస్కృతికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)అన్నారు.

Lok Manthan : ‘లోక్ మంథన్’ భారతీయ సంస్కృతికి నిదర్శనం : కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్ మంథన్ (Lok Manthan)భాగ్యనగర్ 2024 భారతీయ సంస్కృతికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో గురువారం మొదలైన లోక్ మంథన్ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎగ్జిబిషన్ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభించారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం ఈనెల 24 వరకు కొనసాగనుందని తెలిపారు. ప్రజలు ఎవ్వరూ ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ కూడా పాల్గొంటారని తెలపారు. ఈ కార్యక్రమం రాజకీయాలకతీతంగా జరుగుతోందని, ప్రజలందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ లోక్ మంథన్ లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కళాకారులు, మేధావులు, ఆర్టిస్టులు, ఆలోచనాపరులు, పద్మ అవార్డు గ్రహీతలు పాల్గొంటారని తెలిపారు. ఈ మంథన్ కార్యక్రమానికి 2,500 మంది ప్రతినిధులు పాల్గొంటారని కిషన్ రెడ్డి వివరించారు.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమ ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షకావత్ పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు. కాగా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా శిల్పారామంలో ఈనెల 24వ తేదీ వరకు జరిగే లోక్ మంథన్ అంతర్జాతీయ కళాప్రదర్శన ప్రజ్ఞ వాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కాగా దీనికి 12 దేశాల నుంచి 1500 మందికి పైగా కళాకారులు హాజరవుతున్నారు. 120కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలకు రంగం సిద్ధం చేశారు. 24వ తేదీ వరకు శిల్పారామంలో ఉచిత సందర్శనకు అవకాశం కల్పించారు.

Next Story