- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనీస్ మాంజా వాడితే జరిమానా, కేసులేంటి అనుకుంటున్నారా? (వీడియో)
చైనా మాంజాతో ప్రాణాలు డేంజర్.. అమ్మిన కొన్న ఎగరేసిన కేసులు తప్పవంటూ పోలీసుల వార్నింగ్.. చైనా మాంజాతో ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు..

దిశ, వెబ్డెస్క్ : సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఏ గల్లీలో చూసినా పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ కనిపిస్తుంటారు. గాలిపటాలు ఎగురవేస్తూ సంతోషంగా గడపడం సరదాగానే ఉంటుంది. అయితే వాటికి చైనా మాంజా వాడటమే ప్రాణాలను బేజారులో పడేస్తుంది. గాలిలోనే పతంగులను తెంచేయాలని హానికారక రసాయన రంగులతో తయారు చేసిన చైనా దారాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ మాంజాకు తాకిన పక్షులు చనిపోతుండగా మనుషుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. ఈ చైనా మాంజాలు ప్రజల గొంతులకు చుట్టుకొని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఎనిమిదేళ్ల క్రితమే నిషేధం
కీసరలో చోటు చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. ఈ ముప్పును గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2017 జూలై 11న చైనా మాంజా విక్రయాలపై నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1966 ప్రకారం చైనా మాంజాను అమ్మినా కొనుగోలు చేసినా వినియోగించినా నేరం. ఈ మాంజా అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10వేలు జరిమానా విధిస్తారు. చైనా మాంజా విషయంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దారాన్ని అమ్మినా కొనుగోలు చేసినా ఆ మాంజాతో పతంగులు ఎగరేసినవాళ్లపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలతో సందడి చేయాల్సిన సందర్భంలో ప్రాణాంతకమైన 'చైనా మాంజా' ప్రకంపనలు సృష్టిస్తోంది. నిషేధం ఉన్నప్పటికీ బహిరంగ మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్న ఈ సింథటిక్ దారాలు సామాన్య ప్రజల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. పండుగ పూట ఆనందంగా గడపాల్సిన కుటుంబాల్లో ఈ దారాలు ఊహించని విషాదాన్ని నింపుతున్నాయి. కేవలం వినోదం కోసం వాడే ఈ మాంజా,దారపు పోగులా కాకుండా పదునైన కత్తిలా ప్రాణాలను బలితీసుకునే ప్రమాదకర ఆయుధంగా మారింది.
చైనా మాంజా దారుణాలు ఎన్నో..
సంప్రదాయ దారాన్ని వాడాలని అటవీశాఖ అధికారులు, పోలీసులు, పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నాప్పటికీ చైనా మాంజాని కొందరు వ్యాపారులు అక్రమంగా విక్రయిస్తున్నారు.దీంతో పలువురు గాయాలపాలు కాగా పక్షుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గతంలో కూడా చైనా మాంజా చుట్టుకొని చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి.తాజాగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో ఇంటర్ విద్యార్థి జశ్వంత్ బైక్పై వెళ్తుండగా, గాలిలో వేలాడుతున్న చైనా మాంజా అతని మెడకు చుట్టుకుంది. ఈ ప్రమాదం లో అతని మెడ తీవ్రంగా కోసుకుపోవడంతో వైద్యులు ఏకంగా 19 కుట్లు వేయాల్సి వచ్చింది. ఈ ఘటన అందరిని ఆందోళన రేకెత్తిస్తుంది. మరో హృదయవిదారక ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి లోని దుబ్బవాడలో చోటుచేసుకుంది. శ్రీహాన్ అనే నాలుగేళ్ల చిన్నారి మెడకు ఈ ప్రమాదకర మాంజా దారం కోసుకుపోవడంతో ఆ బాలుడు విలవిలలాడిపోయాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ చిన్నారికి వైద్యులు 16 కుట్లు వేశారు.అభం శుభం తెలియని పసివాడు ఇలాంటి ప్రమాదానికి గురికావడం తల్లిదండ్రులను కలిచివేస్తోంది. ఎక్కడ నుండి ఏ దారం వచ్చి మెడకు చుట్టుకుంటుందోనని వాహనదారులు,పాదచారులు ఇప్పుడు రోడ్డు మీదకు రావాలంటేనే వణికిపోతున్నారు. అలాగే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని మొండికుంట స్టేజ్ సమీపంలో గోపిరాజుపల్లి గ్రామానికి చెందిన పిడుగు ఐలయ్య మామిడి తోటలో పనిచేస్తున్న కూలి టీవీఎస్ చాంప్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు నిషేధిత చైనా మాంజా దారం తెగి ఆయనపై పడడంతో మెడ భాగాన తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో ఐలయ్యకు గాయాలై వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మూడు కుట్లు వేశారు.
ఎగిరేయడమే లక్ష్యం.. జాగ్రత్తలు శూన్యం
చైనా మాంజా చాలా ప్రమాదకరం. పక్షులకే కాకుండా ప్రజలకు కూడా వీటి వల్ల ముప్పే. అందుకే ఈ మాంజాను ప్రభుత్వం నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం వీటిని విక్రయించిన వారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. మరికొందరు గాజు కోటింగ్తో కూడిన నైలాన్, సింథటిక్ దారాన్ని వాడుతుంటారు. ఇదీ ప్రమాదకరమే. కంటికి కనిపించకుండా సన్నగా ఉండే దారాలకు పక్షులు చిక్కుకొని చనిపోతున్నాయి. చైనా మాంజాలను తీసుకోవద్దని మన దగ్గర తయారైన సంప్రదాయ దారాన్ని వాడాలనంటున్నారు పతంగుల వ్యాపారులు. ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించినా, క్షేత్రస్థాయిలో దాని అమలు నామమాత్రంగానే కనిపిస్తోంది. పర్యావరణానికే కాకుండా పక్షులకు, మనుషులకు ప్రాణసంకటంగా మారిన ఈ దారాల అమ్మకాలను అరికట్టడంలో యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చైనా మాంజాపై నిషేధం ఉందని సంప్రదాయ దారాన్ని వినియోగించడమే మంచిదని పలువురు పతంగుల వ్యాపారాలు చెబుతున్నారు. మాంజా ఎగురవేసేటప్పుడు విద్యుత్ తీగలు,చెట్లు లేని ప్రదేశాలు చూసుకోవాలి. చెట్లకు, తీగలకు చిక్కిన పతంగులను తీసేందుకు సాహసం చేయకుండా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. తెగిన గాలిపటాలను అందుకోవడానికి ప్రయత్నం చేయకుండా క్రీడా మైదానాల్లో గాలిపటాలను ఎగురవేయడం మేలు. ఇంటి డాబా పైన, మేడపైన గాలిపటాలు ఎగురవేసే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
రంగంలోకి దిగిన నగర సీపీ సజ్జనార్
లేటెస్ట్ గా భారీగా నిషేధిత మాంజాను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయం పైనే కమిషనర్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ చైనా మాంజాపై నిషేధం విధించి పదేళ్లు అవుతోంది. ఇండస్ట్రీయల్ అవసరం కోసం తయారైన దారాన్ని మాంజాగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇక మీదట నగరంలో అమ్మినా కొన్నా ఆ దారంతో పతంగులు ఎగరేసినా కేసులు పెడతాం. చైనా మాంజా కారణంగా ఎవరికైనా గాయాలైనా కేసులు పెడతాం. చైనా మాంజా విషయంలో పీడీ యాక్ట్ ప్రయోగించే ఆలోచన చేస్తున్నాం అని సజ్జనార్ హెచ్చరించారు. చైనా మాంజాపై బ్యాన్ ఉన్నప్పటికీ సంక్రాంతి సీజన్కు ఉన్న మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని దుకాణాదారులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో అవి తెగి మాంజా గాలిలో వేలాడుతున్నాయి. వాహనాలపై ప్రయాణించేవారికి చుట్టుకొని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే పక్షులు చనిపోతున్నాయి. తాజాగా నగరంలో అధికారులు పట్టుకున్న మాంజా విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ,సూరత్, మహారాష్ట్ర నుంచి దుకాణాదారులు చైనా మాంజాను తెప్పించే క్రమంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు చైనా మాంజా తయారు చేస్తున్న రెండు ఫ్యాక్టరీలను సీజ్ చేసినట్లు గుజరాత్,రాజస్థాన్ తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ మాంజా ఫ్యాక్టరీలపై పోలీసుల ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.






