సాహిత్య చరిత్రను పుస్తకాల ద్వారా భవిష్యత్ తరాలకు అందించాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 19 |
సాహిత్య చరిత్రను పుస్తకాల ద్వారా భవిష్యత్ తరాలకు అందించాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాహిత్య చరిత్రను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో వెలికి తీసి భవిష్యత్ తరాలకు పుస్తకాలు, గ్రంధాల రూపంలో అందించాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ అధ్వర్యంలో సంచాలకుడు మామిడి హరికృష్ణ సంపాదకత్వంలో ప్రముఖ రచయిత వడ్డేపల్లి కృష్ణ రచించిన ‘తెలంగాణ ప్రముఖ కవులు - కావ్యాలు’ పుస్తక సంపుటిని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంతంలోని కవులు, రచయితలు, కళాకారులు, చరిత్రకారులు, సాహితీవేత్తలను గుర్తించి వారిని గౌరవిస్తున్నామన్నారు. వారి పేర్లతో అవార్డులను అందజేస్తున్నామన్నారు. జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో భాషాభివృద్ధికి, సాహిత్య అభివృద్ధికి, కళా రంగాల అభివృద్ధికి, నాటక రంగాల అభివృద్ధికి, కళా రంగాల ప్రోత్సాహానికి, అకాడమీలను ఏర్పాటు చేసి సాహిత్య సేవకు పూర్వ వైభవానికి కృషి చేస్తున్నామన్నారు.

తెలంగాణ ప్రాంతంలోని క్రీస్తు శకం 941 సంవత్సరంలోని పంపన్న కవి కాలం నుంచి 1975 వరకు జన్మించిన కవులు వారి కావ్యాల పరిచయం - విశ్లేషణ లను ఈ పుస్తకంలో సవివరంగా పొందుపరిచడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది కవులు ఉన్నారన్నారని సురవరం ప్రతాపరెడ్డి తన గోల్కొండ పత్రిక ద్వారా చాటి చెప్పారన్నారు. గత పాలకులు తెలంగాణ ప్రాంతం పై ఉన్న వివక్ష కారణంగా అనేక కావ్యాలు, గ్రంధాలు కాలగమనంలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాండురంగారెడ్డి, సాయిలు యాదవ్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత రమణ, మంత్రి పీఎస్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed