టీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు. అభ్యర్థుల జాబితా విడుదల చేసిన ఈసీ!

by Disha Web Desk 2 |
టీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు. అభ్యర్థుల జాబితా విడుదల చేసిన ఈసీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది. ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి ఎనిమిది గుర్తుల్ని తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదల చేయడంతోనే ప్రక్రియ మొదలైందని, ఇప్పుడు అది కొనసాగుతూ ఉన్న సమయంలో జోక్యం చేసుకోజాలమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సంఘానికి ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేమని తేల్చి చెప్పింది. టీఆర్ఎస్ తరఫున కార్యదర్శి సోమ భరత్ దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలను న్యాయవాది రవీందర్ రెడ్డి ప్రస్తావిస్తూ, ఈ ఎనిమిది గుర్తులకు సారూప్యత ఉన్నందున ఓటర్లలో గందరగోళానికి దారితీస్తుందన్నారు.

టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినందున కామన్ సింబల్‌గా కారు గుర్తు వచ్చిందని, ఇప్పుడు ఫ్రీ సింబల్స్ జాబతాలో ఉన్న గుర్తుల్లో కెమెరా, చపాతీ రోలర్, డోలీ (పల్లకీ), రోడ్డు రోలర్, సబ్బు పెట్టె, టీవీ, కుట్టుమిషను, ఓడ లాంటివి సిమిలర్‌గా ఉన్నాయని బెంచ్‌కు న్యాయవాది రవీందర్ రెడ్డి వివరించారు. గతంలో సైతం రోడ్డు రోలర్ గుర్తు కారు గుర్తుకు సారూప్యంగా ఉన్నందున ఓట్లు తారుమారమయ్యాయని గుర్తుచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన కొద్దిమందికి ఈ గుర్తులు ఇవ్వడం ద్వారా వేల సంఖ్యలో ఓట్లు పడ్డాయని, ఇది పునరావృతం కాకుండా వీటిని జాబితా నుంచి తొలగించాలని కోరారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం తరఫున హాజరైన న్యాయవాది అవినాష్ దేశాయ్ జోక్య, చేసకుని, ఫ్రీ ఎలక్షన్ సింబల్స్ జాబితాలో ఉన్న ఈ గుర్తులు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావని, టీఆర్ఎస్ పార్టీకి కామన్ సింబల్‌గా ఉన్నప్పటి నుంచీ ఉన్నవేనని కోర్టుకు వివరించారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతనే టీఆర్ఎస్ కామన్ సింబల్‌గా కారు గుర్తును ఎంచుకున్నదని తెలిపారు. రోడ్డు రోలర్ గుర్తు విషయం మినహా ఈ ఎనిమిదింటిలో దేనిమీద కూడా టీఆర్ఎస్ గతంలో ఫిర్యాదు చేయలేదని గుర్తుచేశారు. తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ ఈ నెల 10వ తేదీన ఫిర్యాదు చేసిందని, కానీ దానికి ముందే (ఈ ల 7న) ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిందని, అప్పటికే ఫ్రీ సింబల్స్ లో ఇవి ఉన్నాయని, అప్పుడు ఎందుకు ఈసీ దృష్టికి తీసుకురాలేదని ప్రవ్నించారు. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియ మొత్తం పూర్తయ్యి బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా, వారికి గుర్తుల కేటాయింపు కంప్లీట్ అయిన తర్వాత మార్పులు చేయడం సాధ్యం కాదన్న ఆచరణాత్మక ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.

ఇరు తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సీజే బెంచ్.. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉన్న పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని, ఎన్నికల సంఘానికి సైతం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొని టీఆర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసిన ఎనిమిది గుర్తుల్లో నాల్గింటిని మాత్రమే ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల్లో ఈసీ వాడుతున్నది. మునుగోడు బై ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి ఏ అభ్యర్థికి ఏ గుర్తు కేటాయించిందీ నోటిఫై చేశారు. కెమెరా, చపాతీ రోలర్, టీవీ, ఓడ గుర్తుల్ని మాత్రమే మునుగోడులో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది.


Next Story

Most Viewed