- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పరాయి దేశంపై యుద్ధం చేసినట్లు.. మావోయిస్టులను వేటాడి చంపడమేంటి?: ఆపరేషన్ కగార్పై వామపక్షాలు ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదివాసి జాతిని హననం చేస్తున్న ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో బేషరతుగా శాంతిచర్చలు జరపాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దాదాపు 20 వేల మంది పోలీసు బలగాలతో కర్రెగుట్టను చుట్టుముట్టి నరమేధం సృష్టించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే కర్రెగుట్టల నుంచి పోలీసు క్యాంప్ ఎత్తివేయాలని కోరాయి. హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కే.జీ.రాంచందర్, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఆర్ రాష్ట్ర కార్యదర్శి ఎ.జానకి రాములు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, ఎస్ యూసీఐ రాష్ట్ర కార్యదర్శి సీ.హెచ్.మురహరి, పార్వర్డ్ బ్లాక్ నాయకులు ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పరాయి దేశంపై యుద్ధం చేస్తున్నట్లు దేశ పౌరులైన మావోయిస్టులను తుదముట్టిస్తామని ప్రతిజ్ఞ చేసి మరీ అత్యంత కిరాతకంగా వేటాడి వెంటాడి చంపడం దుర్మార్గమన్నారు. దీనిని న్యాయ స్థానాలు సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణ చేపట్టాలని కోరారు. మావోయిస్టుల అడవులను గానీ, అక్కడ ఉన్న సంపద కానీ స్వాధీనం చేసుకోలేదని, అమాయక ప్రజలైన ఆదివాసీల హక్కులు, వారి రక్షణ కోసం మాత్రమే పోరాడుతున్నారన్నారు. కానీ.. అదే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం ఆ సహాజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టడంలో భాగంగా వారిని తుదముట్టిస్తుండటం తీవ్ర అభ్యంతరకరమన్నారు.
మావోయిస్టుల పేరుతో అడువుల్లో వారిని కాల్చి చంపుతూ, అర్బన్ నక్సలైట్ల పేరుతో మేధావులైన వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వారిని అక్రమంగా జైళ్లలో నిర్భంధించి తీవ్ర మానసిక క్షోభకు గురిచేసి చంపుతున్నారని కూనంనేని ఆరోపించారు. స్వతంత్ర భారతదేశంలో ఎవరూ ఊహించలేని పరిస్థితులు నేడు దేశంలో నెలకొన్నాయని, స్వాతంత్రం రాకముందు కూడా సాయుధ పోరాటం జరిగిందని, అప్పుడు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితి లేదని కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం ప్రశ్నించే వారు ఉండకూదని, అందుకే కుంటి సాకులతో మావోయిస్టులను భౌతికంగా అంతం చేస్తోందని అన్నారు. మావోస్టులు తప్పు చేస్తే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన చట్టాల ద్వారా శిక్షించాలి కానీ ప్రజాస్వామ్యంలో ఒకరిని చంపే అధికారం ఎవరికీ లేదన్నారు. గోద్రా అల్లరి కేసుల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి బహిష్కరణకు గురైన అమిత్ షా అనే వ్యక్తి దేశ హోంశాఖ మంత్రిగా ఉండడం ఈ దేశ ప్రజల దురదృష్టమన్నారు. తక్షణమే కగార్ ఆపరేషన్ నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
మే 2న వామపక్షాల సదస్సు
కేంద్ర ప్రభుత్వం తక్షణమే కగార్ ఆపరేషన్ నిలిపివేసి మావోయిస్టులతో భేషరతుగా చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ మే 2న హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. ఈ సదస్సులో వామపక్ష పార్టీల నాయకులతో పాటు వివిధ వర్గాల మేధావులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు. సదస్సులో అన్ని పార్టీలు, వర్గాల అభిప్రాయాల మేరకు కగార్ ఆపరేషన్ చర్చించి కేంద్రం శాంతి చర్చలు చేపట్టేలా ఒత్తిడి తెచ్చేందుకుగాను కార్యాచరణను రూపొందించనున్నట్లు కూనంనేని తెలిపారు.