గ్యారెంటీల దరఖాస్తు ధర రూ.100 !

by Disha Web Desk 20 |
గ్యారెంటీల దరఖాస్తు ధర రూ.100 !
X

దిశ, సిటీ నెట్‌వర్క్ : అసంపూర్తి ఏర్పాట్ల మద్య గురువారం హైదరాబాద్ జిల్లాలో ప్రజాపాలన మొదలైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలైన ఆరు గ్యారెంటీలను అర్హులకు అందించే లక్ష్యంతో జిల్లాలో అధికారులు చేసిన ఏర్పాట్లు అసంపూర్తిగా ఉండటంతో దరఖాస్తుదారులు పడరాని పాట్లు పడ్డారు. కొన్నిచోట్ల దరఖాస్తులు సమర్పించేందుకు ప్రజలు బారులు తీరగా మరికొన్ని చోట్ల ప్రజల నుంచి స్పందన కరువైంది. ఉదయం ఎనిమిది గంటలకే దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని ప్రభుత్వం ప్రకటించినా అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేకపోయారు. దీంతో పలుచోట్ల ప్రజాపాలన ఆలస్యంగా మొదలైంది.

10 గంటల తర్వాత ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలకు ప్రజలు రావడం మొదలుపెట్టారు. అయితే చాలా మంది వద్ద దరఖాస్తు ఫారాలు లేకపోవడం దళారులకు కలిసి వచ్చింది. ప్రభుత్వం ఉచితంగా ఇస్తామని చెప్పిన ఫారాలను విక్రయించారు. కొన్ని చోట్ల ఫారాలు నింపడం రాని వారికి మేం నింపి ఇస్తామని రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో 600 కేంద్రాలతో పాటు మీ సేవ సెంటర్లు కూడా అందుబాటులో ఉంటాయని, సాయంత్రం. 5 గంటల వరకు నింపిన ఫారాలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించగా కొన్ని చోట్ల మీ సేవ కేంద్రాలను మూడు, నాలుగు గంటల మధ్యలో మూసివేయడం గమనార్హం. ఇదిలా ఉండగా హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన కార్యక్రమాన్ని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2 లో ప్రారంభించారు.

దరఖాస్తుల కొరత..రూ.100 వరకు విక్రయాలు..

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజాపాలన మొదటి రోజున దరఖాస్తుల కొరత స్పష్టంగా కనబడింది. ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్‌లో ఉదయం 11 గంటల వరకే దరఖాస్తు ఫారాలు అందుబాటులో లేకుండా పోయాయి. కేవలం మూడు వందల దరఖాస్తు ఫారాలు మాత్రమే తమకు అందాయని అక్కడ విధుల్లో ఉన్న అధికారి హేమ నాయక్ తెలిపారు. మరోవైపు పాతబస్తీ ప్రజాపాలనలోనూ దరఖాస్తులు కరువయ్యాయి. ప్రజాపాలన మొదటి రోజే ఐదు గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాల కోసం ఆశావాహులు భారులు దీరారు. ప్రజాపాలన దరఖాస్తు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 200 వందల నుంచి 400 వందల వరకే దరఖాస్తు ఫారాలను ఆశావాహులకు అందజేశారు.

దీంతో దరఖాస్తు ఫారాల కోసం జిరాక్స్​ సెంటర్‌లో కలర్ జిరాక్స్ కోసం రూ.50 నుంచి రూ.100 రూపాయలకు కొనుగోలు చేయడం కనిపించింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద గ్యాస్​సిలిండర్​ పత్రాలపై భర్త పేరు ఉందని, అది మార్చుకోవడం ఎలా ? రేషన్ కార్డులు లేక పోతే ఐదు గ్యారంటీలు ఇవ్వరా ? అని భర్త పేరు మీద ఉంటే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా ? అని భార్య పేరు మీద మార్చుకోవాలంటే ఎలా అన్న సందేహాలతో ఉక్కిరి బిక్కిరయ్యారు. రేషన్​కార్డు పై ఉన్న చిరునామలో లేమని ? ఎలా నింపాలని ? మాకు దరఖాస్తు ఫారాలు నింపడం రావడం లేదని ఇతర ఆశావాహుల కోసం ఎదురు చూడడం కనిపించింది. మొత్తం మీద మొదటి రోజు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఓవైపు అధికారులకు, మరోవైపు ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

కిటకిటలాడిన జీరాక్స్ సెంటర్‌లు..

గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల సమీపంలోని జీరాక్స్ సెంటర్‌లు కిటకిటలాడాయి. కొన్నిచోట్ల దరఖాస్తుల స్వీకరించే కేంద్రాల వద్ద కంటే జీరాక్స్ సెంటర్‌ల వద్దనే రద్ధీ అధికంగా కనబడింది. దరఖాస్తు ఫారాల కొరతతో పాటు దానికి జత చేయవలసిన ఆధార్, రేషన్ కార్డులు గ్యాస్ పాస్ బుక్‌ల జీరాక్స్ కోసం బారులు తీరారు.

రేషన్ కార్డు కావాలి..?

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలను అమలు చేసేందుకు గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.2500 సాయం, ఇందిరమ్మ ఇండ్లు, సబ్సిడీ గ్యాస్, రైతు భరోసా, ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. అయితే దరఖాస్తు ఫారంలో రేషన్ కార్డు వివరాలు కూడా నింపాల్సి రావడంతో లేని వారు తమకు పథకం వస్తుందో రాదోనని ఆందోళన చెందారు. రేషన్ కార్డులు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు దరఖాస్తు ఫారంలో కార్డు వివరాలు అడిగిన చోట లేదు అని రాయాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ఇది తెలియని వారు కొంత తికమకకు గురయ్యారు. ఇదే కాకుండా జిల్లాలో అనేక చోట్ల రేషన్ కార్డు కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలని అధికారులను అడగడం కన్పించింది.


Next Story

Most Viewed