- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లొంగిపోయిన మావోయిస్టులు సీపీఐలో చేరండి’.. MLA కూనంనేని బహిరంగ ఆహ్వానం
ప్రజాబలంలేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాబలంలేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్ధంగా సాధించుకుందామని, ఇందుకు కలిసి పని చేసేందుకు జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు మాతృ పార్టీ సీపీఐలో చేరాలని బహిరంగంగా సాధార ఆహ్వానం పలికారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు మంగళవారం రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్లో ప్రారంభమయ్యాయి. సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఎస్.బాల్రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా జాతీయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ, సీపీఐ సెంట్రల్ కమిషన్ ఛైర్మెన్ డాక్టర్ కె.నారాయణ హజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ తన బలమేమిటో నిరూపించుకోవడమే కాకుండా తమతో పొత్తు లేకపోతే ఏమి జరుగుతుందో ఆయా పార్టీలకు ఒక జలక్ ఇచ్చామని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డితోనే తేల్చుకుంటాం..
సీపీఐ ఎవరితో పొత్తు పెట్టుకున్న ఆ ధర్మాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తుందని, కాని ఇతర పార్టీలు మాత్రం పాటించడం లేదని కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మానికి విఘాతం కల్గించిందన్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయనతోనే స్వయంగా తేల్చుకుంటామని కూనంనేని స్పష్టం చేశారు. తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ప్రయోజనాలు పొందాయి తప్పితే వారితో తమకు ఒరగబెట్టింది ఏమిలేదన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్తో ఇక మీదట పొత్తు ఉన్నా, లేకపోయినా ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయనున్నట్లు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
విదేశీ దౌత్య విధానంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం: రామకృష్ణ
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కార్ విదేశీ దౌత్యవిధానంలో పూర్తిగా వైఫల్యం చెందిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. దేశ చరిత్రలో నరేంద్ర మోడీ ఓ అసమర్థ ప్రధాని అని ఆయన పేర్కొన్నారు. గత 12 ఏళ్ల పాలనలో మోడీ సాధించింది ఆర్ఎస్ఎస్ ఎజెండా తప్ప ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మౌలికమైన ఒక్క హామీ కూడా నేరవేర్చలేదని పేర్కొన్నారు. అందిన కాడికి దండు కోవడానికి కార్పోరేట్ రంగాన్ని పెంచి పోషించడం,ఇందుకు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మతతత్వ రాజకీయాలకు ప్పాలడడమే వారి స్పష్టమైన ఏజెండా అని అన్నారు. వీటిని ప్రతిఘంటించడంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు వైఫల్యం చెందడంతో బీజేపీ ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోందని తెలిపారు. బీజేపీని నిలువరించేందుకు కమ్యూనిస్టులు ప్రజా క్షేత్రంలో బలమైన పోరాటాలను నిర్వహించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో సీపీఐ రాష్ట్ర సమితి సాధించిన విజయం తిరిగి దేశ కమ్యూనిస్టు శ్రేణులకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. దీంతో స్ఫూర్తితో త్వరలో జరగనున్న 5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారని తెలిపారు. అధునిక యుగం నరరూప రాక్షసుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అని, సామ్రాజ్యవాద అమెరికా బరితెగించి మరీ ఇతర దేశాలపై యుద్దానికి పాల్పడుతోందని విమర్శించారు.
ప్రజలకు అవమానకరం..
అమెరికాను తిరిగి శక్తివంతమైన దేశంగా చేయలన్నదే లక్ష్యంగా తలపెట్టిన యుద్ద కాంక్షతో పరోక్షంగా 30 దేశాలకు పైగా ప్రభావితం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ యుద్ధం కారణంగా 85 శాతం ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్న మనదేశం ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు గాని, ఈ యుద్ధానికి గాని వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకపోవడం ఈ దేశ ప్రజలకు అవమానకరమన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ,రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కిళ్లపల్లి శ్రీనివాస రావు, ఈటి నరసింహా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళవేన శంకర్, బాల నరసింహా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
పలువురికి సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సంతాపం..
ఇటీవల మరణించిన సీపీఐ నాయకులకు, ప్రముఖలకు రాష్ట్ర కౌన్సిల్ సంతాపాన్ని తెలిపింది. రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ల పల్లి శ్రీనివాసరావు సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టాగా కౌన్సిల్ రెండు నిమిషాలు పాటు మౌనం పాటించి నివాళ్లు అర్పించింది. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు నల్లకన్ను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు నల్లమల్ల గిరి ప్రసాద్ సతీమణి నల్లమల్ల కమలాదేవి, కర్నాటకకు చెందిన ట్రేడ్ యూనియన్ నాయకులు ఎస్.వి.ఆనంద్ కుమార్, నేత్ర వైద్యురాలు డాక్టర్ సరస్వతి, విశాఖ పట్నం చెందిన అభ్యదయ రచయిత సంఘం, మార్కిస్టు నేత చందు సుబ్బారావు తదితరులకు రాష్ట్ర కౌన్సిల్ నివాళ్లు అర్పించింది.






