ఇదే సరైన సమయం.. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదే సరైన సమయం.. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మి తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పాపం అని కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. రాష్ట్ర ప్రజల చేతిలో చిప్ప పెట్టారని విమర్శించారు. ‘రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ, అసంబద్ధ హామీలు నమ్మి ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టుకున్నారని అన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను సూచించారు.


GHMC ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పండి :

‘‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డి మాత్రం ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధిచెప్పే సమయం

ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా – ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది – అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండవ ఘనత సాధించిన పార్టీగా మన గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు. సభకు ముందు భారీ ర్యాలీ నిర్వహించి కేటీఆర్‌కు కార్యకర్తలు స్వాగతం పలికారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

Next Story