వేలేరు మండలంలో కేటీఆర్ సుడిగాలి ప‌ర్యటన.. రూ.150 కోట్ల ప‌నుల‌కు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు

by Disha Web Desk 11 |
వేలేరు మండలంలో కేటీఆర్ సుడిగాలి ప‌ర్యటన.. రూ.150 కోట్ల ప‌నుల‌కు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
X

దిశ‌, వేలేరు: హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో రూ. 150 కోట్ల విలువైన పలు పనులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించి, మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. సోమవారం వేలేరు లో పర్యటించిన మంత్రి కేటీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ ఉన్నారు. హెలిప్యాడ్ వద్ద ఎంపీలు దయాకర్, మాలోతు కవిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ సీపీ రంగనాథ్ లు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేలేరు మండలంలోని పీచర క్రాస్ రోడ్డు వద్ద రూ.103 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మూడు లిఫ్ట్ పైప్ లైన్ లకు శంకుస్థాపన, రూ.40 కోట్లతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా పీచర క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞతా బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. రూ.103కోట్లతో మూడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వేలేరు, ధర్మసాగర్, చిల్పూర్ మండలాల్లోని ఎగువ ప్రాంత గ్రామాలకు సాగునీరు అందించేందుకు రూ.103 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఈ ప్రణాళికల్లో భాగంగా మొదటగా గండిరామారం రిజర్వాయర్ వద్ద పంప్ హౌస్ నిర్మాణంతో పాటు కన్నారం ట్యాంక్ వరకు పైప్ లైన్ నిర్మాణంతో పాటు కన్నారం వద్ద లిఫ్టు నిర్మాణం చేపట్టనున్నారని చెప్పారు. కన్నారం, పీచర, మద్దెలగూడెం, కొండాపూర్, లింగంపల్లి, శ్రీపతిపల్లి, జనగామ జిల్లాలోని అబ్దుల్ నాగారం, నర్సాపురం, సోలిపురం, పోతారం, అంకుషాపురం కూటిగల్ లాంటి మొత్తం 14 గ్రామాల పరిధిలోని 3, 354 ఎకరాలకు రూ. 65 కోట్ల 54లక్షలతో సాగునీరు అందించే పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నామన్నారు.

రెండోది గుండ్లసాగరం రూ.9 కోట్ల 74లక్షలతో లిఫ్ట్ నిర్మాణం చేపట్టి పైపు లైన్ ద్వారా లోక్యతండా చెరువు నింపడం ద్వారా 1620 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ఈ పైప్ లైన్ ద్వారా వేలేరు, శాలపల్లి, కమ్మరిపేట, బండతండా, మాటుతండా, చింతలతండా, ఎర్రబెల్లి, నారాయణగిరి, ముప్పారం గ్రామాల రైతులకు పైప్ లైన్ ద్వారా సాగునీరు అందుతుందన్నారు. మూడో లిఫ్ట్ ఉప్పుగల్-నష్కల్ రిజర్వాయర్ వద్ద పంప్ హౌజ్ నిర్మించి లిఫ్ట్ ద్వారా రూ.31 కోట్ల 48లక్షల తో 1820 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తైతే వేలేరు, ధర్మసాగర్, చిల్పూర్ ప్రాంతాల రైతుల సాగు నీటి సమస్య తీరుతుందన్నారు. వేల ఎకరాల బీడు భూమి సాగులోకి వస్తుందని తెలిపారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీపార్టీలు మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.... స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని కోరారు. ఘన్ పూర్ నియోజకవర్గంలో కొత్తగా రెండు మండలాలు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ఇంకో రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతుందని అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ ఎస్సీ నియోజకవర్గం పై మంత్రి కేటీఆర్ చల్లని చూపు ఉండాలని కోరారు.

మూడు లిఫ్ట్ లు పూర్తయితే స్టేషన్ ఘన్ పూర్ ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుందని అన్నారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వం లో ఘన్ పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రాంతానికి సాగునీరు కోసం నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, వొడితెల సతీష్ కుమార్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, ఆరూరి రమేష్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, జడ్పీ చైర్మన్ లు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed