KTR: అసెంబ్లీ నడుస్తుంటే ఆటలేంటి?

by Gantepaka Srikanth |

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అత్యంత కీలకమైన పద్దులపై చర్చలతో కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించడం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

KTR: అసెంబ్లీ నడుస్తుంటే ఆటలేంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అత్యంత కీలకమైన పద్దులపై చర్చలతో కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించడం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఇంత సీరియస్‌గా సభ జరుగుతున్న సమయంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని నిలదీశారు. ఇదే విషయాన్ని తాను మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వద్ద ఎటువంటి సమాధానం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఇరిగేషన్ వంటి అత్యంత ముఖ్యమైన సబ్జెక్టులపై సభలో లోతైన చర్చ జరగాల్సి ఉన్నదని.. కానీ ప్రభుత్వం మాత్రం పద్దులపై చర్చను త్వరగా ముగించి పారిపోవాలని చూస్తున్నదని విమర్శించారు. కీలకమైన అంశాలపై చర్చలు జరగాల్సిన సమయంలో ఎమ్మెల్యేలు మైదానాల్లో ఆటలు ఆడుతుంటే చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారని నిలదీశారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఈ క్రీడా పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల కాలాన్ని ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించకుండా, ఇలాంటి కార్యక్రమాలతో కాలయాపన చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. చర్చించాల్సిన కీలకమైన అంశాలు పక్కనపెట్టి కేవలం ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఈ క్రీడా పోటీలను ఒక సాకుగా చూపిస్తున్నదని మండిపడ్డారు. అసెంబ్లీ నడపడం చేతకాదు కానీ.. ఈ ఆటలపోటీలు ఏంటని ప్రశ్నించారు.

Next Story