ధాన్యం కొనుగోళ్ల పైన కేటీఆర్ అబ‌ద్దాలు చెబుతున్నారు: ఎంపీ, పోరిక‌ బ‌ల‌రాం నాయ‌క్

by Malleboina Mahesh |

ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నారని, గతంలో సివిల్ సప్లైస్‌ను ముంచిన బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

ధాన్యం కొనుగోళ్ల పైన కేటీఆర్ అబ‌ద్దాలు చెబుతున్నారు: ఎంపీ, పోరిక‌ బ‌ల‌రాం నాయ‌క్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కేటీఆర్ అస‌భ్య ప‌ద‌జాలంతో మాట్లాడుతున్నారని మహాబూబాబాద్ ఎంపీ, పోరిక బలరాం నాయక్ మండిపడ్డారు. శుక్రవారం సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్, రాంచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాందాస్ నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి బలరాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ తీసుకువ‌చ్చింది తామని, కేసీఆర్ పార్లమెంటులో ఆ నాడు క‌నిపించ‌లేదన్నారు. ధాన్యం కొనుగోళ్ల పైన కేటీఆర్ అబ‌ద్దాలు చెపుతున్నారని, కేటీఆర్ జాగ్రత్తగా మాట్లాడాలని, తమకు సంస్కారం ఉందని బలరాం నాయక్ హితవు పలికారు. రైతుల కోసం తమ ప్రభుత్వం ప‌నిచేస్తోందని, ప్రతి చోట కొనుగోలు కేంద్రాలున్నాయన్నారు. కేటీఆర్ వ‌డ్లు, మ‌క్కలు తీసుకుని వ‌స్తే కొనుగోలు చేయ‌క‌పోతే అడ‌గాలని, బీఆర్ఎస్ మ‌ళ్లీ గెలిచేది లేదని, కేటీఆర్ కు అంత సీన్ లేదని బలరాం నాయక్ మండిపడ్డారు. నేరెళ్లలో ద‌ళితుల‌ను వేధిస్తే లోక్ సభ మాజీ స్పీక‌ర్ మీరాకుమార్ వ‌చ్చి క‌న్నీళ్లు పెట్టుకున్నారని ఆయన తెలిపారు.

ప‌దేళ్లలో ధాన్యం కొనుగోలు చేయ‌కుండా రైతుల‌ను వంచించారు : ప్రభుత్వ విప్, రామచంద్రనాయ‌క్

కేటీఆర్, హ‌రీష్ రావుల మ‌ధ్య పోటీతో ఇద్దరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కేటీఆర్ మ‌తి త‌ప్పి సీఎం ప‌ద‌వికి గౌర‌వం ఇవ్వకుండా సంస్కార హీనంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్, రామచంద్ర నాయక్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పైన నోరు పారేసుకుంటే స‌భ్య స‌మాజం ఊర్కోదని, ఇష్టానుసారంగా భాష ఉప‌యోగిస్తే తెలంగాణ ప్రజ‌లు నాలుకలు కోస్తారు జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు. ప్రతిప‌క్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రారని, అధికారాన్ని అడ్డం పెట్టుకున్ని బీఆర్ఎస్ పార్టీకి 1200 కోట్ల ఫండ్ సంపాదించి అక్రమ సంపాద‌న‌తో త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారని రాంచంద్ర నాయక్ ఆరోపించారు. ప‌దేళ్లలో ధాన్యం కొనుగోలు చేయ‌కుండా రైతుల‌ను వంచించారని, సివిల్ స‌ప్లయిస్ కార్పొరేష‌న్ ను అప్పుల పాలు చేసిన స‌న్నాసులని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై చేస్తున్న కుట్రల‌ను మా సీఎం తిప్పికొడుతున్నారని, కేటీఆర్ త‌న భాష‌ ను మార్చుకోవాలని, ఆయన భాష మార్చుకోపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని రాంచంద్ర నాయక్ ఫైర్ అయ్యారు. దొంగే దొంగ అన్నట్లుగా కేటీఆర్ తీరు ఉందని, కొనుగోలు చేసిన ధాన్యానికి ఆరు నెల‌ల వ‌ర‌కు డ‌బ్బులు ఇవ్వని వాళ్లు మ‌మ్మల్ని విమ‌ర్శిస్తున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి వ‌స్తున్న మైలేజ్ చూసి ఓర్వ లేక కేటీఆర్ విమ‌ర్శలు : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

వ‌రి వేస్తే ఉరే అని రైతుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసిన పార్టీ బీఆర్ఎస్ అని, మిర్చి రైతుల‌కు బేడీలు వేసి ఉగ్రవాదుల్లా చూసి జైలుకు పంపిన చ‌రిత్ర గ‌త ప్రభుత్వానిదని అచ్చంపల్లి ఎమ్మెల్యే, చిక్కుడు వంశీకృష్ణ విమర్శించారు. మొక్క జొన్న పంట ఈ సారి విప‌రీతంగా దిగుబ‌డి వ‌చ్చిందని, మొక్క జొన్న కొనుగోలు చేయ‌మ‌ని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా తమ ప్రభుత్వం కోంటోందన్నారు. ప్రభుత్వానికి వ‌స్తున్న మైలేజ్ చూసి ఓర్వ లేక కేటీఆర్ విమ‌ర్శలు చేస్తున్నారని, తమ ప్రభుత్వం రైతుల కోసం ప‌నిచేస్తోందన్నారు. బండి సంజ‌య్ కుమారుడి కేసు పైన కేటీఆర్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని, తమ ప్రభుత్వం ఎక్కడా రాజీ ప‌డ‌లేదని వంశీకృష్ణ చెప్పారు.

రాజ‌కీయ భ‌విష్యత్తు లేద‌న్న భ‌యంతో పిచ్చెక్కి కేటీఆర్ మాట్లాడుతున్నారు :ఎమ్మెల్యేమాలోత్ రాందాస్ నాయ‌క్

రాష్ట్ర రైతుల‌ను మోసం చేసిన కేసీఆర్, కేటీఆర్ మమ్మల్ని విమ‌ర్శిస్తున్నారని, రాజ‌కీయ భ‌విష్యత్తు లేద‌న్న భ‌యంతో పిచ్చెక్కి కేటీఆర్ మాట్లాడుతున్నారని వైరా ఎమ్మెల్యే, మాలోత్ రాందాస్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యక‌ర్తలు తిర‌గ‌బ‌డితే క‌ల్వకుంట్ల కుటుంబం నిల‌బ‌డ‌దని, కేటీఆర్ కు రాజ‌కీయ భ‌విష్యత్తు లేదని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం అకాల వ‌ర్షాల‌కు పంట న‌ష్టపోతే ప‌దివేలు ఇస్తాన‌ని రైతుల‌ను ద‌గా చేశారని ఆరోపించారు. స‌ర్పంచ్ ల ద‌గ్గర నుంచి ప్రతి ఒక్కరు ధాన్యం కొనుగోళ్లలో పాల్గొంటున్నారని, మార్కెట్ ల‌కు పోయి బీఆర్ఎస్ నాయ‌కులు రాజ‌కీయం చేస్తున్నారని రాందాస్ నాయక్ ఆరోపించారు.

బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యార‌ని తెలంగాణ ప్రజ‌ల‌కు తెలుసు :ఎమ్మెల్సీ శంక‌ర్ నాయ‌క్

వ‌రి వేస్తే ఊరే అన్న కేసీఆర్ త‌న ఫామ్ హౌస్ లో మాత్రం వ‌రి వేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వ‌చ్చాకే రైతుల‌కు న్యాయం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, శంకర్ నాయక్ తెలిపారు. ఈ సారి ప్రతి పంట బాగా దిగుబ‌డి వ‌చ్చిందని, తమ మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంత‌రం స‌మీక్షలు చేస్తున్నారని ఆయన చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యార‌ని తెలంగాణ ప్రజ‌ల‌కు తెలుసని, హ‌రీష్ రావు, క‌వితల పంచాయ‌తీ తమకు పూయవద్దని, కేసీఆర్ కుటుంబ పంచాయ‌తీని తమ పైన రుద్దుతున్నారని శంకర్ నాయక్ ఫైర్ అయ్యారు.

Next Story